
- దర్యాప్తులో గుర్తించిన ఈడీ ఆఫీసర్లు
- క్యాసినో దందాపై నాలుగో రోజూ కొనసాగిన విచారణ
- ఈ బిజినెస్లో ఇన్వెస్ట్ ఎంత.. ఇన్కమ్ ఎంత?
- ఫారిన్ బ్యాంక్ అకౌంట్లతో లింక్ ఏంటని ప్రశ్నించిన ఈడీ
హైదరాబాద్, వెలుగు: క్యాసినో హవాలా కేసులో ఈడీ ఆఫీసర్లు కీలక సమాచారం సేకరించారు. క్యాసినో నిర్వాహకుడు చీకోటి ప్రవీణ్కుమార్ వాట్సాప్ చాటింగ్స్లో నలుగురు ఎమ్మెల్యేలు, ఓ మాజీ ఎమ్మెల్యే నంబర్స్ను గుర్తించినట్లు తెలిసింది. ఇందులో హైదరాబాద్కు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు, ఏపీకి చెందిన ఓ ఎమ్మెల్యే, ఓ మాజీ ఎమ్మెల్యే నంబర్స్ ఉన్నట్లు సమాచారం. చీకోటి స్టేట్మెంట్స్ ఆధారంగా క్యాసినోలో లెక్కలు లేని డబ్బులు డంప్ చేసిన వారికి నోటీసులు ఇచ్చి, విచారించే అవకాశాలు ఉన్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఇప్పటికే నోటీసులు ఇచ్చారని జరుగుతున్న ప్రచారాన్ని అధికారులు నిర్ధారించడం లేదు. మరోవైపు చీకోటి ప్రవీణ్ను నాలుగో రోజైన శుక్రవారం ఈడీ ప్రశ్నించింది. చీకోటితోపాటు మాధవరెడ్డి, ట్రావెల్ ఏజెంట్ సంపత్ హాజరుకాగా.. గంటన్నర పాటు విచారణ జరిగింది. ప్రవీణ్ క్యాసినోకు సంబంధించిన కీలకమైన బ్యాంకు లావాదేవీలను అధికారులు గుర్తించినట్లు తెలిసింది. ప్రవీణ్ స్టేట్మెంట్ ఆధారంగా డాక్యుమెంట్లను సీజ్ చేసుకున్నట్లు సమాచారం. గోవా, నేపాల్ క్యాసినోల నుంచి జరిగిన ఆర్థిక లావాదేవీలు, టోకెన్స్తో జరిగిన హవాలాను ట్రేస్ చేస్తున్నట్లు తెలిసింది.
నేపాల్ నుంచి డబ్బులు ఎట్ల వచ్చినయ్?
క్యాసినో బిజినెస్కు ముందున్న ప్రవీణ్ అకౌంట్స్ను ఈడీ పరిశీలించినట్లు తెలిసింది. గోవా, నేపాల్లో నిర్వహిస్తున్న క్యాసినోలో ఇన్వెస్ట్మెంట్స్, నిర్వహణ ఖర్చులు, వాటికి సంబంధించిన ప్రమోషన్స్ వివరాలతో స్టేట్మెంట్ రికార్డ్ చేసినట్లు సమాచారం. ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన ఆడిట్ రిపోర్టులను అందించాలని ఆదేశించినట్లు తెలిసింది. ఫారిన్ బ్యాంక్ అకౌంట్లకు ఇండియన్ కరెన్సీ ఎంత ట్రాన్స్ఫర్ చేశారనే వివరాలు రాబట్టినట్లు తెలిసింది. నేపాల్ నుంచి ఇండియాకు వచ్చిన డబ్బు ఏ రూపంలో వచ్చిందనే వివరాలు సేకరిస్తున్నారు. విచారణ సోమవారం కూడా జరిగే అవకాశం ఉన్నట్లు తెలిసింది.
వివరాలన్నీ వెల్లడిస్త: చీకోటి
ఈడీ విచారణ ముగిసిన తర్వాత మీడియాతో చీకోటి ప్రవీణ్ మాట్లాడాడు. క్యాసినో బిజినెస్ చేశానని, ఇందులో చాలా మంది రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులతో పరిచయాలు ఉండడం సహజమని చెప్పాడు. ఈడీ అధికారుల ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇస్తున్నట్లు తెలిపాడు. అవసరమైన డాక్యుమెంట్లు ఇచ్చినట్లు చెప్పాడు. తాను ఎవ్వరికీ భయపడనని, ఈడీ విచారణ పూర్తయిన తర్వాత అన్ని వివరాలు వెల్లడిస్తానని అన్నాడు. సోషల్ మీడియాలో కొంతమంది తనపై అసత్య ప్రచారం చేస్తున్నారని, అలాంటి వారిని వదిలే ప్రసక్తే లేదని చెప్పాడు. ఫేక్ అకౌంట్స్పై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపాడు. తనకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని హైకోర్టులో పిటిషన్ వేసినట్లు వెల్లడించాడు.