
- రంగారెడ్డి, నాగర్కర్నూల్ జిల్లాల్లో రెండేసి చొప్పున ఏర్పాటు
- 16 విద్యాసంస్థలను విలీనం చేస్తూ విద్యా కమిషన్ ఉత్తర్వులు
- ఈ ఏడాది నుంచే ప్రీప్రైమరీ తరగతులూ ప్రారంభం
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో నాలుగు తెలంగాణ పబ్లిక్ స్కూళ్ల (టీపీఎస్)ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. రంగారెడ్డి, నాగర్కర్నూల్ జిల్లాల్లో రెండేసి చొప్పున ఏర్పాటు చేయగా.. ఇందుకోసం మొత్తం 16 విద్యాసంస్థలను విలీనం చేసింది. ఒకే ఏరియాలో ఉన్న స్కూళ్లు, కాలేజీలను విలీనం చేస్తూ తెలంగాణ విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళీ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.
రంగారెడ్డి జిల్లాలోని మంచాల మండలం, నాగర్కర్నూల్ జిల్లాలోని వంగూరు మండలంలో టీపీఎస్ల పైలెట్ ప్రాజెక్టు అమలు చేయడానికి గైడ్లైన్స్ జారీ చేశారు. నాగర్ కర్నూల్ జిల్లా వంగూరులోని మండల ప్రజాపరిషత్ స్కూల్( ఎంపీపీఎస్– జి), ఎంపీపీఎస్ (బి), జెడ్పీహెచ్ఎస్ (జి), జెడ్పీహెచ్ఎస్, కేజీబీవీతో పాటు సర్కార్ జూనియర్ కాలేజీని కలిపి ‘తెలంగాణ పబ్లిక్ స్కూల్ వంగూరు’గా మార్చుతున్నారు.
ఇదే మండలం పోల్కంపల్లిలోని ఎంపీపీఎస్ , జెడ్పీహెచ్ఎస్ స్కూళ్లను విలీనం చేసి ‘తెలంగాణ పబ్లిక్ స్కూల్ పోల్కంపల్లి’గా ఏర్పాటు చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లాలోని మంచాలలో ఎంపీపీఎస్, జెడ్పీహెచ్ఎస్ (జి), జెడ్పీహెచ్ఎస్ (బి), సర్కార్ జూనియర్ కాలేజీని కలిపి ‘తెలంగాణ పబ్లిక్ స్కూల్ మంచాల’గా మారుస్తున్నారు. ఇదే మండలం ఆరుట్లలోని ఎంపీపీఎస్, జెడ్పీహెచ్ఎస్ (జి), జెడ్పీహెచ్ఎస్, తెలంగాణ మోడల్ స్కూల్ను ‘తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఆరుట్ల’గా మారుస్తున్నారు.
ప్రైమరీ టీచర్ల నియామకాలు...
ఈ విద్యా సంవత్సరం నుంచే ప్రీ-ప్రైమరీ తరగతులు (నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ) ప్రారంభమవుతాయి. ఇందుకోసం అర్హత కలిగిన స్థానిక మహిళలను టీచర్లుగా నియమిస్తారు. వీరంతా ఫస్ట్ క్లాసు నుంచి డిగ్రీ వరకు ఇంగ్లీష్ మీడియంలో చదివి ఉండాలి.
క్లాసులు ఇలా..
విలీనమైన తర్వాత ఒకే తరగతికి చెందిన విద్యార్థులను కలిపి కొత్త సెక్షన్లుగా విభజిస్తారు. ప్రతి సెక్షన్లో 40 మంది విద్యార్థులు ఉండేలా చూస్తారు. మంచాలలో ప్రస్తుతమున్న స్కూల్ ప్రాంగణంలో నర్సరీ నుంచి 8వ తరగతి వరకు, స్కూల్ ఆవరణకు 800 మీటర్ల దూరంలో ఉన్న జూనియర్ కాలేజీ ఆవరణలో 9వ తరగతి నుంచి 12వ తరగతి వరకు క్లాసులు నిర్వహించనున్నారు. అన్ని క్లాసుల విద్యార్థులకు ఒకే ల్యాబ్, లైబ్రరీ, డైనింగ్ హాల్ తదితర వాటిని అందుబాటులోకి తీసుకొస్తారు.