జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ అధినేత మసూద్ అజర్ ఆస్తులను జప్తు చేసే దిశగా ఫ్రాన్స్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మసూద్ ఆస్తులను ఫ్రీజ్ చేస్తున్నట్లు శుక్రవారం ప్రకటించింది. మసూద్ అజర్ ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించాలన్న ప్రతిపాదన తీసుకొచ్చిన మూడు దేశాల్లో ఫ్రాన్స్ కూడా ఉంది. ఈ ప్రతిపాదనను చైనా మరోసారి అడ్డుకోవడంతో అమెరికా భగ్గమంటోంది. మసూద్ అజర్ విషయంలో కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని అమెరికా చైనాను ఇప్పటికే హెచ్చరించింది. అమెరికాకు ఫ్రాన్స్ తోడైంది. ఉగ్రవాదంతో సంబంధం ఉన్న వ్యక్తులతో యురోపియన్ యూనియన్ ఓ లిస్టును తయారు చేస్తోంది. ఈ జాబితాలో మసూద్ పేరును చేర్చే అంశంపై చర్చిస్తామని ఫ్రాన్స్ అంతర్గత మంత్రిత్వ శాఖ, ఆర్థిక శాఖ, విదేశాంగ శాఖలు తెలిపాయి.
అయితే ఉగ్రవాదం విషయంలో పాక్ కు వత్తాసు పలుకుతున్న చైనా మాత్రమే మసూద్ అజర్ ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించాలన్న ప్రతిపాదనను అడ్డుకుంటూ వస్తున్నది. నాలుగుసార్లు తన వీటో అధికారంతో ఈ ప్రతిపాదనను చైనా అడ్డకుంది. దీంతో చైనా వైఖరిపై భద్రతామండలి సభ్యత్వ దేశాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. భగ్గుమంటున్నాయి. అంతేకాదు మసూద్ అజర్ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించాలన్న భారత్ డిమాండ్కు క్రమంగా మద్దతు పెరుగుతోంది.