పెద్ద పెద్ద దేశాలు ఇప్పటికే అంతరిక్షంపై పట్టు బిగించేశాయి. మరి, అక్కడే యుద్ధమంటూ జరిగితే పరిస్థితేంటి? అమెరికా, చైనా, భారత్ వంటి దేశాలు ఇప్పటికే యాంటీ శాటిలైట్ మిసైల్స్ను సిద్ధం చేసుకున్నాయి. ఇటీవలే ఇండియా దానిని విజయవంతంగా పరీక్షించింది కూడా. మరి, భూమ్మీది నుంచి కాకుండా ఆకాశంలో ఉంటూనే దాడి చేసే సత్తా ఉంటే ఎట్లుంటది? ఆ సత్తానే సంపాదించుకుంది ఫ్రాన్స్. శత్రు దేశాల వెన్నులో వణుకు పుట్టించేలా ఆయుధాలతో కూడిన నిఘా ఉపగ్రహాన్ని తయారు చేసింది ఆ దేశం. అంటే శత్రు దేశాల వ్యూహ ప్రతివ్యూహాలను పసిగట్టడమే కాకుండా, దాడి చేయడానికి ఉపయోగించే మిసైళ్లను నాశనం చేసేలా వాటికి లేజర్లు, మెషీన్ గన్నులను అమర్చింది. వాటికి తోడుగా ఆయుధాలున్న డ్రోన్లూ జత కలవబోతున్నాయి. 2023 నాటికి ఈ నిఘా ఉపగ్రహాన్ని, ఆ డ్రోన్లను కక్ష్యలోకి ప్రవేశపెట్టనుంది ఫ్రాన్స్. ఈ విషయాన్ని గురువారం లైయన్ మోంట్ వెర్దన్ ఎయిర్బేస్లో జరిగిన కార్యక్రమంలో స్వయానా ఆ దేశ రక్షణ మంత్రి ఫ్లోరెన్స్ పార్లీ ప్రకటించారు. ‘‘అంతరిక్షంలో మిలటరీ ఆపరేషన్లు చేయాలంటే, ఒంటరిగా పోరాడే సత్తా సాధించుకోవాలి. అలాగని ఆయుధాల రేసులో ఫ్రాన్స్ ఉండబోదు” అని పార్లీ చెప్పారు. ఉపగ్రహాలను ఎవరైనా టార్గెట్ చేస్తే, వారి పనిబట్టేందుకు మాత్రమే వీటిని ఉపయోగిస్తామన్నారు. ఈ స్పేస్కమాండ్ అంతా కూడా దేశ వాయుసేన ఆధ్వర్యంలోనే పనిచేస్తుందన్నారు. అంతరిక్ష ప్రయోగాలు దేశ భద్రతకు సవాళ్లు విసురుతున్న నేపథ్యంలోనే ఈ స్పై శాటిలైట్లను పంపుతున్నట్టు చెప్పారు. దేశాధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రన్ అనుకుంటున్నట్టుగా సెప్టెంబర్ 1 నుంచి స్పేస్ కమాండ్ పని ప్రారంభమవుతుందన్నారు. అంతరిక్షంలో ఉన్న తమ ఉపగ్రహాలను ఎల్లప్పుడూ జాగ్రత్తగా చూసుకునేలా చిన్న చిన్న ఉపగ్రహాలను లేజర్కక్ష్యలోకి వదులుతామన్నారు. ప్రత్యర్థి ఉపగ్రహాల నుంచి పొంచి ఉన్న ముప్పును పసిగట్టి వెంటనే దాడులు చేయడానికి రెడీ అవుతుందన్నారు.