
- వెల్లడించిన ఆర్బీఐ
- 14,483 కేసుల నమోదు
న్యూఢిల్లీ : ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఆర్నెళ్లలో బ్యాంకింగ్ రంగంలో మోసాల సంఖ్య గణనీయంగా పెరిగి 14,483 కేసులకు చేరుకుందని ఆర్బీఐ రిపోర్టు ప్రకటించింది. ఇది ‘ బ్యాంకింగ్ ట్రెండ్ ప్రోగ్రెస్ 2022–-23’ పేరుతో విడుదల చేసిన నివేదిక ప్రకారం.. సైబర్ మోసాలు, డేటా ఉల్లంఘనల నుంచి బ్యాంకింగ్ వ్యవస్థను, చెల్లింపుల వ్యవస్థను రక్షించాల్సిన అవసరం ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రథమార్థంలో 14,483 మోసాలు జరగగా, రూ. 2,642 కోట్లను కస్టమర్లు నష్టపోయారు. గత ఏడాది ఇదే కాలంలో 5,396 కేసులు నమోదు కాగా, బాధితులు రూ. 17,685 కోట్లు పోగొట్టుకున్నారు. ‘‘మోసాల వల్ల బ్యాంకుల పేరు ప్రతిష్టలు దెబ్బతింటాయి. వ్యాపారాలు నష్టపోతాయి. బ్యాంకింగ్ వ్యవస్థపై వినియోగదారుల నమ్మకాన్ని దెబ్బతీస్తాయి. 2022–-23లో, బ్యాంకులు నివేదించిన మోసాల మొత్తం ఆరేళ్ల కనిష్ట స్థాయికి తగ్గింది”అని ఈ నివేదిక పేర్కొంది.
2022–-23 మధ్యకాలంలో జరిగిన మోసాల్లో కోల్పోయిన మొత్తం తగ్గింది. కార్డ్ లేదా ఇంటర్నెట్ సంబంధిత మోసాలకు సంబంధించిన కేసుల సంఖ్య ఎక్కువగా ఉంది. కొత్త టెక్నాలజీని వాడటం వల్ల సైబర్ ఎటాక్లు, డేటా ఉల్లంఘనలు, ఆపరేషనల్ఫెయిల్యూర్స్ కూడా పెరిగాయి. ఇలాంటి వాటిని తగ్గించడానికి బ్యాంకులు సైబర్ సెక్యూరిటీ రిస్క్లను మెరుగ్గా గుర్తించి పరిష్కరించాల్సిన అవసరం ఉందని ఆర్బీఐ పేర్కొంది. భారతదేశంలోని షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకులు కూడా డేటా అనలిటిక్స్, మోసాలను గుర్తించడం, ఇతర అంచనా విశ్లేషణల కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను (ఏఐ) ఉపయోగించుకుంటున్నాయని నివేదిక వెల్లడించింది. కస్టమర్ అనుభవాన్ని మెరుగుపరచడానికి బ్యాంకులు చాట్బాట్లు లేదా వర్చువల్ అసిస్టెంట్లను కూడా తీసుకొచ్చాయని ఆర్బీఐ పేర్కొంది.