నకిరేకల్, (వెలుగు): ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని నకిరేకల్ ఎమ్మెల్యే వీరేశం సతీమణి పుష్ప, నకిరేకల్ మున్సిపల్ చైర్మన్ చౌగోని రజిత కోరారు. నకిరేకల్ పట్టణంలోని శ్రీనివాస నర్సింగ్ హోమ్ ఆవరణలో రాపోలు ఫౌండేషన్, జిల్లా ప్రసూతి వైద్య నిపుణుల సంఘం ఆధ్వ ర్యంలో నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరంలో మాట్లాడారు. రొమ్ము క్యాన్సర్పై మహిళలు అవగాహన పెంచుకోవాలని, జీవన శైలి, ఆహారంలో మార్పులు చేసుకోవాలని సూచించారు.
ప్రసూతి వైద్య నిపుణుల సంఘం జిల్లా అధ్యక్షురాలు డాక్టర్ రాపోలు మంజుల మాట్లాడుతూ శారీరక శ్రమ, నిద్ర, ఒత్తిడి, ధూమపానం, శీతల పానీయాలు నియంత్రించడం వల్ల క్యాన్సర్ కు దూరంగా ఉండొచ్చన్నారు. కొన్ని రకాల క్యాన్సర్లు తొలి దశలో గుర్తిస్తే నయం చేసుకునే వీలుంటుందని తెలిపారు. శిబిరంలో స్త్రీ పురుషులు 200 మందికి వివిధ రకాల ఉచిత వైద్యపరీక్షలు చేశారు. కార్యక్రమంలో డాక్టర్ వినయ్, ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ రాపోలు రఘునందన్, మురారి శెట్టి, కృష్ణమూర్తి, నల్లగొండ ఆసుపత్రి శ్రీనివాస నర్సింగ్ హోమ్ ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.
