
ప్రకృతిలో నిత్యం వస్తున్న మార్పులు పర్యావరణ సమతూల్యతను దెబ్బతీస్తున్నాయి. దీంతో తరచూ ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తున్నాయి. తద్వారా పంట నష్టాలు ఏటా పెరిగిపోతోంది. కాగా ఇటీవల ఓ ఫంగల్ ఇన్ఫెక్షన్ పంటలను దెబ్బతీస్తోంది. దీంతో ప్రపంచ ఆహార భద్రతకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ప్రపంచవ్యాప్తంగా 10 – 23 శాతం పంటల నష్టం..
ప్రపంచవ్యాప్తంగా ఏటా 10 – 23 శాతం పంటలు ఫంగల్ ఇన్ఫెక్షన్లు ఎదుర్కొంటాయని 10 – 20 శాతం పంటలను రైతులు నష్టపోతారని శాస్ర్తవేత్తలు హెచ్చరిస్తున్నారు. విభిన్న జీవుల సమూహం అయిన శిలీంధ్రాలు బీజాంశాల ద్వారా ఇవి పునరుత్పత్తి చేస్తాయి. వాతావరణ మార్పులు పంటల ఉత్పత్తికి సవాలుగా మారుతున్న ఈ తరుణంలో ఫంగల్ ఇన్ఫెక్షన్లు ప్రపంచానికి ఆందోళన కలిగిస్తున్నాయి. ఉష్ణోగ్రతలు పెరిగేకొద్దీ, శిలీంధ్రాలు దానిని తట్టుకునే సామర్థ్యాన్ని పొందుతాయి. తద్వారా పంట నష్టం మరింత జరిగే అవకాశం ఉందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.
ప్రభావం వీటి పైనే...
వరి, గోధుమ, మొక్కజొన్న, సోయాబీన్స్, బంగాళదుంపలోని అయిదు ముఖ్యమైన కేలరీలను ఈ ఫంగస్ ప్రభావితం చేస్తుంది. ఈ పరిస్థితి ప్రపంచ ఆహార సంక్షోభానికి దారి తీయవచ్చు.
వ్యవసాయ పద్ధతుల్లో మార్పు తప్పనిసరి..
పంటల ఉత్పాదకత పెంపొందించే క్రమంలో వ్యవసాయ పద్ధతుల్లో మార్పులు తీసుకురావాలని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఈ ఫంగస్ ని తట్టుకునే వంగడాలు సృష్టించడం ద్వారా ఆహార సంక్షోభం నుంచి కొంతైన గట్టెక్కవచ్చని చెబుతున్నారు. ఇందుకోసం ప్రభుత్వాలు, దాతృత్వ సంస్థలు, ప్రైవేటు కంపెనీలు సహకరించాలని కోరుతున్నారు.