గడ్డం వినోద్, గడ్డం వివేక్ వెంకటస్వామికి మంత్రి పదవులు ఇవ్వాలి : కాసర్ల యాదగిరి

గడ్డం వినోద్, గడ్డం వివేక్ వెంకటస్వామికి మంత్రి పదవులు ఇవ్వాలి : కాసర్ల యాదగిరి
  • తెలంగాణ మాల మహానాడు డిమాండ్

బెల్లంపల్లి, వెలుగు: బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్, చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామికి రాష్ట్ర మంత్రివర్గంలో అవకాశం కల్పించాలని తెలంగాణ మాల మహానాడు నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరారు. శనివారం బెల్లంపల్లి ప్రెస్ క్లబ్​లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాల మహానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసర్ల యాదగిరి, ఉపాధ్యక్షుడు సబ్బని రాజనర్సు, నియోజకవర్గ ప్రెసిడెంట్ ఎరుకల శ్రీనివాస్ మాట్లాడారు. గతంలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రిగా పనిచేసిన అనుభవం గడ్డం వినోద్​కు ఉందని, ఆయన మంత్రిగా జిల్లా అభివృద్ధికి ఎంతో కృషి చేశారని తెలిపారు.

పెద్దపల్లి పార్లమెంట్​ సభ్యునిగా పనిచేసిన గడ్డం వివేక్ వెంకటస్వామి బెల్లంపల్లి, మంచిర్యాల, చెన్నూరు అసెంబ్లీ నియోజకవర్గాల అభివృద్ధికి కృషి చేశారని పేర్కొన్నారు. వారి తండ్రి కాకా వెంకటస్వామి దేశంలో కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి ఎనలేని కృషి చేశారని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఈ విషయాలను పరిగణలోకి తీసుకొని గడ్డం వినోద్, గడ్డం వివేక్ వెంకటస్వామికి మంత్రి పదవులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో మాల మహానాడు నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు లింగాల అమృత, జిల్లా ఉద్యోగ సంఘాల అధ్యక్షుడు గుర్రం ప్రదీప్ కుమార్, పట్టణ సెక్రెటరీ కంది రవికుమార్, ఉపాధ్యక్షురాలు కొప్పుల రవళి తదితరులు పాల్గొన్నారు.