గద్వాల/ కేటీదొడ్డి, వెలుగు: రూ.40 కోట్ల వడ్లను పక్కదారి పట్టించిన గద్వాల జిల్లా కేటీదొడ్డి మండలంలోని నందిన్నె గ్రామంలోని మిల్లర్పై క్రిమినల్ కేసు నమోదు చేసినట్లు ఎస్సై శ్రీనివాసులు తెలిపారు. ఎస్సై, సివిల్ సప్లై ఆఫీసర్లు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 17న నందిన్నె గ్రామంలోని శ్రీ కమ్మిడి స్వామి రైస్ మిల్ లో సోదాలు నిర్వహించారు.
మిల్లులో పెద్ద ఎత్తున సీఎంఆర్ వడ్లు మాయమైనట్లు గుర్తించి కలెక్టర్ కు నివేదిక అందజేశారు. 2022 నుంచి ఇప్పటి వరకు రూ.40.70 కోట్ల విలువైన 77,775,160 మెట్రిక్ టన్నుల వడ్లు లేనట్లు గుర్తించారు. పెండింగ్ సీఎంఆర్ ఇచ్చేందుకు గడువు పొడిగించినప్పటికీ, సీఎంఆర్ ఇవ్వకపోవడంతో సివిల్ సప్లై ఆఫీసర్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిల్లర్ కురువ వీరన్నపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.
మరో రైస్ మిల్లులో రూ.24 కోట్లకు పైగా అక్రమాలు
ఖిల్లాగణపురం: వనపర్తి జిల్లా ఖిల్లాగణపురం మండలం పర్వతాపురం గ్రామ శివారులోని శ్రీ గురుదత్త ఇండస్ట్రీస్ లో మంగళవారం సివిల్సప్లై ఆఫీసర్లు తనిఖీలు నిర్వహించి, భారీగా అక్రమాలు జరిగినట్లు గుర్తించారు. ఈ మిల్లుకు 2022–--23లో రబీ, 2023–-24 రబీ, ఖరీఫ్ సీజన్ లకు సంబంధించిన 2.40 లక్షల బస్తాల వడ్లు కేటాయించారు. ఇందులో రూ.24 కోట్లకు పైగా విలువైన 1,88,034 బస్తాల వడ్లు మాయమైనట్లు వనపర్తి సివిల్ సప్లై డీఎం ఆంజనేయులు తెలిపారు.
