- బూర నర్సయ్య గౌడ్
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ విమోచన దినోత్సవాన్ని రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తామని మాజీ ఎంపీ, తెలంగాణ విమోచన ఉత్సవ కమిటీ చైర్మన్ బూర నర్సయ్య గౌడ్ తెలిపారు. చారిత్రక ఘట్టాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు.. నాటి పోరాట వీరుల త్యాగాలను స్మరించుకునేలా కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. మంగళవారం నాంపల్లిలోని బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
తెలంగాణ విమోచన పోరాటంలో ఉమ్మడి వరంగల్ జిల్లాకు ప్రత్యేక చరిత్ర ఉందని చెప్పారు. నాటి పోరాట స్ఫూర్తిని ప్రస్తుత తరానికి వివరించాల్సిన అవసరం ఉందన్నారు. అక్కడి చారిత్రక ప్రదేశాలను సందర్శించడం, అమరవీరుల స్తూపాల వద్ద నివాళులర్పించడం, భారీ బహిరంగ సభలు నిర్వహించాలని పార్టీ నేతలకు సూచించారు. కమిటీ కన్వీనర్ నెల్లి శ్రీవర్ధన్ రెడ్డి, మారుతినేని ధర్మారావు, గుజ్జల ప్రేమేందర్ రెడ్డి, రావు పద్మ పాల్గొన్నారు.
