లెజెండ్స్ లీగ్ క్రికెట్లో ఆడనున్నట్లు గంభీర్ ప్రకటన

 లెజెండ్స్ లీగ్ క్రికెట్లో ఆడనున్నట్లు గంభీర్ ప్రకటన

లెజెండ్స్ లీగ్ క్రికెట్లో ఆడబోతున్నట్లు టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ ప్రకటించాడు. సెప్టెంబర్ 17న ప్రారంభం కానున్న ఈ లీగ్ రెండో ఎడిషన్లో ఆడతానని చెప్పాడు. చాలా రోజుల తర్వాత మైదానంలో అడుగుపెట్టబోతున్నందుకు గంభీర్ ఆనందం వ్యక్తం చేశాడు. మళ్లీ వరల్డ్ క్రికెట్లో  భుజాలు ఎగురవేసేందుకు ఆతృతగా ఉన్నట్లు  గంభీర్ పేర్కొన్నాడు. 

ఇండియా మహారాజాస్ తరపున..
లెజెండ్స్ లీగ్ క్రికెట్లో గంభీర్ ఇండియా మహారాజాస్ తరఫున ఆడనున్నాడు.  అయితే ఇండియా మహారాజాస్ వర్సెస్ వరల్డ్ జెయింట్స్ మధ్య సెప్టెంబర్ 16న  మ్యాచ్ జరగనుంది. ఈ  మ్యాచ్‌కు గంభీర్ అందుబాటులో ఉండడం లేదు. గంభీర్ సెప్టెంబర్ 17 నుంచి లీగ్కు అందుబాటులోకి వస్తాడు. 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా ఈడెన్ గార్డెన్స్‌లో  ఇయాన్ మోర్గాన్ నాయకత్వంలోని వరల్డ్ జెయింట్స్‌తో ఇండియా మహారాజాస్ టీమ్ తలపడనుంది. ఈ జట్టుకు సౌరవ్ గంగూలీ నాయకత్వం వహించనున్నాడు. ఇక లెజెండ్స్ లీగ్ క్రికెట్ 2వ ఎడిషన్‌లో 4 జట్లు మొత్తం 15 మ్యాచ్‌లు ఆడతాయి.

గంభీర్ కెరీర్..
గౌతమ్ గంభీర్ టీమిండియా తరపున 58టెస్టులు, 147 వన్డేలు, 37 టీ20లు ఆడాడు.  ఇంటర్నేషనల్ క్రికెట్లో అతను 10వేలకు పైగా రన్స్ సాధించాడు. 2007లో టీ20 వరల్డ్ కప్ విజయంలో కీలక పాత్ర పోషించిన  గంభీర్..అటు 2011లో వన్డే వరల్డ్ కప్ సాధించడంలోనూ కీలక ఇన్నింగ్స్ ఆడాడు.  వరల్డ్ కప్ ఫైనల్లో  97 పరుగులు సాధించాడు. అటు ఐపీఎల్లో గంభీర్ సారథ్యంలో  కోల్కతా నైట్ రైడర్స్ 2012, 2014లో టైటిల్స్ సాధించింది. గంభీర్ 2018లో అన్ని రకాల క్రికెట్‌ ఫార్మాట్ల నుంచి రిటైర్ అయ్యాడు.