బొక్కలగుట్ట గ్రామ శివారులోని సదర్ల భీమన్నకు పూజలు

బొక్కలగుట్ట గ్రామ శివారులోని  సదర్ల భీమన్నకు పూజలు
  •     దేవతమూర్తులకు గంగస్నానాలు
  •     అట్టహాసంగా గాంధారీ ఖిల్లా  మైసమ్మ జాతర షురూ

కోల్​బెల్ట్, వెలుగు : గిరిజనుల ఆరాధ్య దైవమైన గాంధారీ ఖిల్లా మైసమ్మ తల్లి మూడు రోజుల జాతర శుక్రవారం అట్టహాసంగా ప్రారంభమైంది. సదర్ల భీమన్న దేవుడికి పూజలు, దేవతమూర్తులను గంగస్నానాలకు తరలించే కార్యక్రమాలను వైభవంగా నిర్వహించారు. 

మందమర్రి మండలం బొక్కలగుట్ట గ్రామ శివారులోని రుష్యమూక పర్వతం వద్ద గల సదర్ల భీమన్న ఆలయంలో దేవాపూర్, ర్యాలీగడ్​పూర్​, ఊరుమందమర్రి తదితర ప్రాంతాలకు చెందిన నాయక్​పోడ్​వంశం కులపెద్దలు గిరిజన సంప్రదాయ పద్ధతిలో భీమన్న దేవుడికి ప్రత్యేక పూజలు చేశారు. 

గంగస్నానాలకు తరలింపు..

సదర్ల భీమన్న ఆలయంలో పూజల అనంతరం నాయక్​పోడ్​గిరిజన కుటుంబాలు, భక్తులు, భీమన్న గజాలు(దేవతమూర్తులు), గుర్రాలు, శూలలు(ఆమ్ములు), రాజులదేవుడిని పూజ గంపలో ఉంచి నెత్తిన పెట్టుకొని తప్పటగుళ్లు, ప్రిల్లనగోవు, డప్పుచప్పుల మధ్య కాలినడకన శోభాయాత్రగా మంచిర్యాలలోని గోదావరి నదికి తీసుకెళ్లారు. బొక్కలగుట్టు, తిమ్మాపూర్‌‌, గద్దెరాగడి, మంచిర్యాల ప్రాంత భక్తులు వీరికి స్వాగతం పలికారు.

ఇవాళ గాంధారి ఖిల్లాకు దేవతలు..

గాంధారి ఖిల్లా మైసమ్మ జాతరలో రెండో రోజు శనివారం సాయంత్రం సదర్ల భీమన్న ఆలయం నుంచి దేవతమూర్తులను జాతర జరిగే గాంధారి ఖిల్లా దిగువ ప్రాంతానికి ఊరేగింపుగా తీసుకెళ్తారు.