వినాయక నిమజ్జనం వెనుక రహస్యం ఇదే..

వినాయక నిమజ్జనం వెనుక రహస్యం ఇదే..

 వినాయక చవితి రోజు వినాయక ప్రతిమలను ప్రతిష్టించి పెద్ద ఎత్తున పూజలు నిర్వహించి ఆ ప్రతిమలను మూడు రోజులకు లేదా ఐదు రోజులకు లేదా తొమ్మిది రోజులకు నిమజ్జనం చేయడం మనం చూస్తున్నాము.అయితే ఈ విధంగా వినాయక ప్రతిమను నిమజ్జనం చేయడానికి గల కారణం ఏమిటి? అనే విషయాలను గురించి ఇక్కడ తెలుసుకుందాం…

ప్రతి ఏడాది వినాయక చవితి వర్షాకాలంలో వస్తుంది.ఈ క్రమంలోనే వర్షాకాలం ప్రారంభానికి ముందుగానే చెరువుల నుంచి పూడిక తీసి వినాయకుడి ప్రతిమలను తయారు చేస్తారు.ఈ విధంగా మట్టితో తయారుచేసిన వినాయకుడుని వివిధ పత్రాలతో పూజ చేసిన అనంతరం నిమజ్జనం చేస్తారు.

ఋతు ధర్మాలను అనుసరించి జరుపుకునే పండుగలలో వినాయక చవితి కూడా ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంది. సర్వ విఘ్నాలకు ఆది నాయకుడైన ఆ విఘ్నేశ్వరుడి చవితి పండుగ , ప్రతి సంవత్సరం భాద్రపద శుక్ల చవితి రోజున జరుపుకుంటాం. ఎండాకాలపు వేడి తాపం తగ్గి బీటలు వారిన భూమి వర్షపు జల్లులతో ప్రాణశక్తిని పుంజుకుని , పచ్చదనాన్ని కలిగి ఉంటుంది. ప్రతి సంవత్సరం భాద్రపద శుక్ల చవితి రోజున వినాయకుడిని ప్రతిష్టించుకొని ,తొమ్మిది లేదా పదకొండు లేదా 21 రోజుల తర్వాత వినాయకుడిని  నిమజ్జనం చేస్తారు..

భక్తి తో కూడిన వివరాలతో పాటు శాస్త్రీయ కోణం కూడా ఉంది.. భక్తుల మాటలను వినడానికి భూమిపైకి వచ్చిన వినాయకుడిని తిరిగి స్వర్గానికి పంపించడానికి దగ్గరి దారి సముద్రమే కనుక .. అందుకే వినాయకుడు విగ్రహాలను  నీటిలో నిమజ్జనం చేస్తారు. మట్టితో చేసిన వినాయక ప్రతిమలను మాత్రమే ఉపయోగించడం లో కూడా ఒక విశేషం ఉంది.. వర్షాల కారణంగా సరస్సులు, కొలనులు అన్ని బురద పూడికతో నిండి ఉంటాయి. ఒండ్రు మట్టి కోసం జలాశయంలో మట్టిని  తీయడంవల్ల పూడిక తీసినట్లు అవుతుంది..అప్పుడు  నీళ్లు తేట పడతాయి..వినాయకుడి  బొమ్మలు చేయడం వల్ల మట్టిలోని మంచి గుణాలు ఒంటపడతాయి అని ఆయుర్వేద శాస్త్రవేత్తలు  చెబుతున్నారు.ఈ విధంగా ఎన్నో ఔషధ గుణాలు కలిగినటువంటి పత్రాలు నీటిలో కలవడం వల్ల అందులో ఉన్నటువంటి క్రిమికీటకాలు తొలగిపోయి నీరు శుద్ధి చేయబడతాయి.ఈ క్రమంలోనే ఈ విధమైనటువంటి నీటిని తాగడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు వచ్చేవి కావు.

అందుకోసమే మట్టితో తయారు చేసిన వినాయకుడి విగ్రహాలను నిమజ్జనం చేస్తారు.ప్రస్తుత కాలంలోఎన్నో రసాయనాలను ఉపయోగించి వినాయకుడి విగ్రహాలను తయారు చేయటం వల్ల వినాయకుడి విగ్రహాలను నిమజ్జనం చేసిన తరువాత నీరు పెద్ద మొత్తంలో కలుషితమై ఎన్నో జలచరాలకు ముప్పు ఏర్పడుతుంది.

వినాయకుడి విగ్రహాలను నిమజ్జనం చేయడం వెనుక కూడా మరో కారణం ఉంది.మట్టితో చేసిన విగ్రహాలకు కేవలం తొమ్మిది రోజులు మాత్రమే దైవత్వం ఉంటుందని, తొమ్మిది రోజుల తర్వాత మట్టి విగ్రహాలను పూజించినప్పటికీ అందులో ఏ విధమైనటువంటి దైవ శక్తులు ఉండవని, అందుకోసమే తొమ్మిదవ రోజు ఈ విధమైనటువంటి వినాయకుడి ప్రతిమలను నిమజ్జన చేస్తారని చెప్పవచ్చు.కేవలం వినాయకుడి ప్రతిమలు మాత్రమే కాకుండా దేవీనవరాత్రుల సమయంలో అమ్మవారి విగ్రహాలను కూడా నవరాత్రులు పూర్తికాగానే నిమజ్జనం చేయడం మనం చూస్తున్నాము.

పది రోజులపాటు పూజలు చేసిన వినాయక విగ్రహాన్ని 11వ  రోజున వైభవంగా జల విసర్జనం చేయడంలో కూడా ఒక రహస్యం ఉంది. పంచభూతాత్మకమైన ప్రతి ఒక్క పదార్థం అనగా పంచభూతాల నుండి జనించిన ప్రతి ఒక్కటి జీవ , నిర్జీవ పదార్థం భూమి మీద ఎంత విలాసవంతంగా , లగ్జరీగా జీవించినప్పటికీ అంతిమంగా మట్టిలో కలిసి పోవాల్సిందే. అందుకే ప్రకృతి దేవుడైన మట్టి వినాయకుడిని చేసి, అంగరంగా వైభవంగా పూజలు చేసి మేళాలు ,తప్పట్లు మధ్య  ప్రజల కోలాహలం హడావిడి నడుమ వినాయకుడిని ఊరేగించి చివరికి సముద్రంలో నిమజ్జనం చేస్తారు. ఎంత బాగా బతికినా చివరికి మట్టిలోనే కలిసిపోవాల్సిందే అన్న ఒక్క సారాంశంతో వినాయకుడి నిమజ్జనం చేస్తారు.