ఇంద్రవెల్లిలో గంజాయి తరలిస్తున్న ముఠా అరెస్ట్ : సీఐ మడవి ప్రసాద్

ఇంద్రవెల్లిలో గంజాయి తరలిస్తున్న ముఠా అరెస్ట్ : సీఐ మడవి ప్రసాద్
  •     4 కిలోలు స్వాధీనం 

ఇంద్రవెల్లి, వెలుగు: ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో గంజాయి సరఫరా చేస్తున్న ముఠాను శుక్రవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీస్ స్టేషన్ లో సీఐ మడవి ప్రసాద్ ప్రెస్ మీట్ నిర్వహించి వివరాలు వెల్లడించారు. మండలంలోని మర్కాగూడా గ్రామపంచాయతీ పరిధి నవాగూడకు చెందిన కొడప రమేశ్ అలియాస్ గంగు, కుమ్ర గంగారాంతో పాటు హర్కపూర్ పంచాయతీ పరిధి కోలాంగూడాకు చెందిన కుమ్ర కృష్ణ నవాగూడ నుంచి బైక్​పై గంజాయి సరఫరా చేస్తున్నట్లు వచ్చిన పక్కా సమాచారంతో ఇంద్రవెల్లిలోని శ్మశాన వాటిక ప్రాంతంలో పోలీసులు మాటువేశారు. సిబ్బందితో కలిసి ఎస్సై సాయన్న ఆ ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు.

వారి వద్ద నుంచి 4 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. బైక్, రెండు ఫోన్లు సీజ్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. నిందితులపై కేసు నమోదు చేసి, ఉట్నూర్ లోని కోర్టులో హాజరు పరిచి రిమాండ్ కు తరలించినట్లు పేర్కొన్నారు. గంజాయి సాగు చేయడం, అమ్మడం చట్టరీత్య నేరమన్నారు. సమావేశంలో ఎస్సై సాయన్న, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.