మైనర్లతో గంజాయి​ నెట్​వర్క్.. స్లమ్‌‌ ఏరియాల్లోని పిల్లలే టార్గెట్‌‌

మైనర్లతో గంజాయి​ నెట్​వర్క్..  స్లమ్‌‌ ఏరియాల్లోని పిల్లలే టార్గెట్‌‌
  • బస్తీలు, స్లమ్‌‌ ఏరియాల్లోని పిల్లలే టార్గెట్‌‌
  • వారికి అలవాటు చేసి.. వారితోనే రిటైల్‌‌ దందా
  • సిటీలో స్కూల్స్, కాలేజీల వద్ద గంజాయి ప్యాకెట్ల అమ్మకం
  • నెల రోజుల్లో15 మందిని పట్టుకున్న టీన్యాబ్‌‌ ఆఫీసర్లు

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: గంజాయి ముఠాలు రూట్‌‌‌‌ మార్చాయి. పోలీసులకు చిక్కకుండా కొత్త ఎత్తులు వేస్తున్నాయి. పాత నేరస్తులపై స్టేట్‌‌‌‌యాంటీ నారొటిక్స్‌‌‌‌ బ్యూరో(టీఎస్‌‌‌‌ న్యాబ్‌‌‌‌), పోలీసుల నిఘా పెరగడంతో గంజాయి ముఠాలు మైనర్లతో సరుకు సప్లయ్​చేస్తున్నాయి. పెడ్లర్ల అవసరం లేకుండా మైనర్లతో గంజాయి దందా నడిపిస్తున్నాయి. ఇందుకోసం సిటీలో మైనర్లందరితో నెట్‌‌‌‌వర్క్‌‌‌‌ ఏర్పాటు చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. ఓల్డ్‌‌‌‌ సిటీ సహా గ్రేటర్ హైదరాబాద్‌‌‌‌ మూడు కమిషనరేట్ల పరిధిలోని బస్తీలు, స్లమ్స్‌‌‌‌, ఆటో స్టాండ్స్‌‌‌‌, స్కూల్స్, కాలేజీల వద్ద మైనర్లు గంజాయి సప్లయ్ చేస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులతో కలిసి టీ న్యాబ్‌‌‌‌ అధికారులు నిఘా పెట్టారు.

రిటైల్ సెల్లర్స్‌‌‌‌గా..

గంజాయి ముఠాలు మైనర్ల ద్వారా గంజాయ్​సప్లయ్​చేస్తున్నాయి. ముందుగా ఏజెంట్స్‌‌‌‌ సప్లయర్స్‌‌‌‌కు కిలోల చొప్పున గంజాయి చేర్చితే, దాన్ని రిటైల్‌‌‌‌గా సేల్‌‌‌‌ చేసేందుకు 50 గ్రాముల నుంచి 100 గ్రాముల ప్యాకెట్స్‌‌‌‌గా మార్చుతున్నాయి. చదువుకోకుండా, ఖాళీగా ఉంటూ బస్తీల్లో నివసించే మైనర్లకు డబ్బు ఆశచూపి వారిని ఈ దందాలోకి లాగుతున్నాయి. 13 నుంచి 17 ఏండ్ల వయసు గల మైనర్లను తీసుకొచ్చి వారికి గంజాయి ప్యాకెట్స్​ఇచ్చి బైక్స్‌‌‌‌పై కాకుండా బస్సులు, ఆటోల్లో ప్యాసింజర్స్‌‌‌‌గా ట్రావెల్ చేయిస్తూ.. కావాల్సిన వారికి గంజాయ్​సప్లయ్​ చేస్తున్నారు. పోలీసుల చెకింగ్‌‌‌‌ జరిగే అవకాశాలు ఉన్న ప్రాంతాల్లో గంజాయి ప్యాకెట్లను బయటకు విసిరేసేలా ట్రైనింగ్‌‌‌‌ ఇస్తున్నాయి. మైనర్లను గంజాయి బాధితులుగా చేసి, వారినే సప్లయర్స్‌‌‌‌గా మార్చుతున్నట్లు పోలీసులు గుర్తించారు.

స్కూల్‌‌‌‌, కాలేజీల స్కూడెంట్స్ టార్గెట్‌‌‌‌గా

గంజాయి ముఠాల ప్రతినిధులు.. మైనర్లను గంజాయి ప్యాకెట్లతో కాలేజీలు, స్కూళ్ల వద్ద మోహరిస్తున్నారు. చెడు అలవాట్లకు బానిసలైన స్టూడెంట్స్‌‌‌‌ను టార్గెట్‌‌‌‌ చేస్తున్నారు. గంజాయితో తయారైన హాష్ ఆయిల్‌‌‌‌, సిగరెట్స్‌‌‌‌తో గంజాయి అందిస్తున్నారు. ముందుగా అతి తక్కువ ధరకే విక్రయిస్తూ, ఆ తర్వాత వారితోనే గంజాయి చైన్ క్రియేట్ చేస్తున్నారు. కమీషన్స్‌‌‌‌తో సప్లయ్ చేస్తున్నారు. మైనర్లు పోలీసులకు దొరికినా పెద్దగా చర్యలు ఉండవని, కౌన్సిలింగ్స్‌‌‌‌తోనే సరిపోతుందని గంజాయి ముఠాలు మైనర్లను ఈ ఊబిలోకి లాగుతున్నాయి. ఈ క్రమంలోనే మైనర్ల గంజాయి నెట్​వర్క్​ను టీఎస్ న్యాబ్‌‌‌‌ అధికారులు గుర్తించారు. గత నెల రోజులుగా సిటీలో వివిధ ప్రాంతాల్లో15 మంది మైనర్లను అదుపులోకి తీసుకునివిచారించారు.

ఏజెన్సీల నుంచి సిటీకి

ఏపీ, ఒడిశా ఏజెన్సీల నుంచి భారీ ఎత్తున్న గంజాయి ట్రాన్స్‌‌‌‌పోర్ట్‌‌‌‌ అవుతున్నది. ఏటా దాదాపు రూ.5 కోట్లు విలువ చేసే గంజాయిని ట్రాన్స్‌‌‌‌పోర్ట్ చేస్తున్నట్లు అంచనా. టీ న్యాబ్‌‌‌‌ పోలీసులు గతేడాది రూ.4.13 కోట్లు విలువ చేసే1,905 కిలోల గంజాయి,630 ఎమ్‌‌‌‌ఎల్‌‌‌‌ హాష్‌‌‌‌ ఆయిల్‌‌‌‌ స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 30 కేసుల్లో 84 మందిని అరెస్ట్ చేశారు. గత నెల రోజుల నుంచి గంజాయి, డ్రగ్స్​ కట్టడిపై స్పెషల్​ ఫోకస్​పెట్టిన పోలీసులు.. సప్లయ్​చైన్​లింక్​పట్టుకొని ముఠాలకు చెక్​పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు.