
నల్లగొండ జిల్లా పెద్దవూరలో విషాదం నెలకొంది. శుక్రవారం ( సెప్టెంబర్19) ఉదయం ప్రైవేట్ స్కూల్ బస్సు కింద పడి ఏడేళ్ల బాలుడు మృతిచెందాడు. ఆగ్రహించిన బాలుడి పేరెంట్, బంధువులు, స్థానికులు స్కూల్ ముందు ధర్నా చేశారు. వివరాల్లోకి వెళితే..
పెద్దవూర మండల కేంద్రంలోని శాంతినికేతన్ స్కూల్ బస్సు కింద పడి ఒకటవ తరగతి చదువుతున్న గౌతమ్ చక్రశాలి అనే బాలుడు మృతిచెందాడు. దీంతో స్కూల్ యాజమాన్యం పై ఆగ్రహించిన విద్యార్థి తల్లిదండ్రులు, బంధువులు ఆందోళనకు దిగారు. విద్యార్థి సంఘాలతో కలిసి శాంతినికేతన్ పాఠశాల ముందు ధర్నా చేశారు. గౌతమ్ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
విషయం తెలుసుకున్న జిల్లా విద్యాశాఖ అధికారి బిక్షపతి సంఘటనా స్థలానికి చేరుకొని బాధితులను శాంతింపచేశారు. పూర్తి స్థాయిలో విచారణ జరిపి పాఠశాలపై చర్యలు తీసుకుంటామని హామి ఇచ్చారు.