
న్యూఢిల్లీ: జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (జెన్ఏఐ) (టెక్స్ట్, ఇమేజ్స్ వంటివి క్రియేట్ చేసే ఏఐ) తో దేశ జీడీపీ వచ్చే ఏడేళ్లలో అదనంగా 1.2 ట్రిలియన్ డాలర్ల నుంచి 1.5 ట్రిలియన్ డాలర్లు పెరుగుతుందని ఈవై రిపోర్ట్ వెల్లడించింది. ‘ఏఐడియా ఆఫ్ ఇండియా’ పేరుతో దేశంలో జెన్ఏఐ మార్కెట్పై ఓ సర్వే చేసింది. ఇండియా డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ జెన్ఏఐతో మరింత వేగంగా జరుగుతుందని పేర్కొంది.
‘జీడీపీలో జెన్ఏఐ ప్రభావం 69 శాతం ఐటీ, లీగల్, కన్సల్టింగ్ వంటి బిజినెస్ సర్వీలస్ల నుంచి, ఫైనాన్షియల్ సర్వీస్లు, ఎడ్యుకేషన్, రిటైల్, హెల్త్కేర్ సెక్టార్ల నుంచి వస్తుంది’ అని ఈవై రిపోర్ట్ పేర్కొంది. డిజిటల్ బాట పడుతున్న కంపెనీలు, సంస్థలు మొదట ఏఐ వైపు చూస్తున్నాయంది. కస్టమర్లను ఆకర్షించేందుకు, ప్రొడక్టివిటీ పెంచేందుకు ఏఐ బెటర్ అని భావిస్తున్నాయని వెల్లడించింది.
ఈవై రిపోర్ట్ ప్రకారం, దేశంలోని 75 శాతం వ్యాపారాలు జెన్ఏఐ కోసం తక్కువ స్థాయి నుంచి మధ్య స్థాయి వరకు రెడీగా ఉన్నాయి. బిజినెస్ల కోసం జెన్ఏఐని వాడడంలో ఉద్యోగులకు స్కిల్స్ లేకపోవడం పెద్ద అడ్డంకిగా ఉందని 52 శాతం ఆర్గనైజేషన్లు చెప్పాయి. అవసరం పెద్దగా ఉండదని 42 శాతం వెల్లడించాయి. కస్టమర్లను ఆకర్షించడానికే జెన్ఏఐని ఎక్కువగా వాడతామని 75 శాతం ఆర్గనైజేషన్లు పేర్కొనగా, 73 శాతం ఆర్గనైజేషన్లు బయట నుంచి టెక్ సపోర్ట్ తీసుకుంటామని తెలిపాయి.