
వాషింగ్టన్: అమెరికా ఆర్మీ జనరల్ మార్క్ మిల్లీ చేసిన పనిపై ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ట్రంప్ ప్రెసిడెంట్గా ఉన్న టైంలో మిల్లీ చైనాకు సీక్రెట్గా పలుసార్లు ఫోన్ కాల్స్ చేశారు. ఈ విషయాన్ని ఆయనే ఒప్పుకున్నారు. అఫ్గాన్ పరిణామాలు సహా పలు అంశాలపై విచారణకు సెనేట్ ఆర్మ్డ్ సర్వీస్ కమిటీని యూఎస్ ఏర్పాటు చేసింది. రిపబ్లికన్లు, డెమోక్రాట్లు సభ్యులుగా ఉండే ఈ కమిటీ ఇటీవల చేసిన విచారణలో ఈ విషయం బయటికి వచ్చింది. ఫోన్ కాల్స్పై మిల్లీని కమిటీ ప్రశ్నించింది. “కరోనా వైరస్ విషయంలో చైనాపై ట్రంప్ అసహనంతో ఉన్నారు. ఈ విషయాన్ని గమనించి చైనా ఆర్మీ (పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ)పై దాడి చేయవచ్చని అనుకున్నాను. పోయినేడాది అక్టోబరు 30న చైనా జనరల్ లీ జూచెంగ్కు కాల్ చేశా. మీ దేశంపై ట్రంప్ కోపంతో ఉన్నారని, యుద్ధానికి ఆదేశించే అవకాశాలు ఉన్నాయని తెలిపా. అయితే మీరు వెంటనే తిరిగి దాడి చేయవద్దని చెప్పాను. జనవరి 8న మరోసారి చైనాకు ఫోన్ చేశా. పదవి నుంచి వైదొలగే సమయంలో చైనాపై దాడి చేయాలని ట్రంప్ ఆదేశించొచ్చని, ఆదేశాలు అందిన వెంటనే చెప్తానని చైనా జనరల్కు చెప్పా. అమెరికా సైనిక జనరల్స్ను సమావేశ పరిచి ట్రంప్ ఆదేశాలను వెంటనే అమలు చేయవద్దని సూచించా. చైనాపై దాడులు చేయాలనే ఉద్దేశం ట్రంప్కు లేదని తెలుసు. కానీ ఆ సమయంలో ఉద్రిక్తతలు తగ్గించడం నా కర్తవ్యం. అందుకే అలా చేశా” అని మార్క్ మిల్లీ పేర్కొన్నట్టు బాబ్ ఉడ్వర్డ్, రాబర్ట్ కోస్టా రాసిన ‘పెరల్’ అనే బుక్లో పేర్కొన్నారు. ఈ పుస్తకం రాయడానికి ముందు మిల్లీని ఉడ్వర్డ్ ఇంటర్వ్యూ చేశారు. తాను చేసిన పనిని మిల్లీ సమర్ధించుకుంటున్నారు. దీనిని రిపబ్లికన్లు ఖండిస్తున్నారు. అతను రాజీనామా చేయాలని లేదా ప్రెసిడెంట్ జో బైడెన్ మిల్లీని పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు.