జెనీవా: ఇండియా గ్రాండ్ మాస్టర్, వరల్డ్ చాంపియన్ డి. గుకేశ్, జావోకిర్ సిందరోవ్ (ఉజ్బెకిస్తాన్) మధ్య జరగనున్న ఫిడే వరల్డ్ చాంపియన్షిప్ జెనీవాలో జరగనుంది. ఈ మేరకు ఫిడే మంగళవారం వేదికను ఖరారు చేసింది. నవంబర్ 25 నుంచి డిసెంబర్ 15 వరకు ఈ హైవోల్టేజ్ పోరు జరగనుంది. ఈ మ్యాచ్ స్టార్టయ్యే నాటికి గుకేశ్, సిందరోవ్ ఇద్దరి వయసు 20 ఏళ్లే కావడం విశేషం.
చెస్ చరిత్రలో ఇద్దరు అతిపిన్న వయస్కులుగా వరల్డ్ చాంపియన్షిప్లో తలపడటం ఇదే మొదటిసారి. ఈ టోర్నీలో మొత్తం 14 క్లాసికల్ గేమ్స్ జరుగుతాయి. ఏడున్నర పాయింట్లు సాధించిన వారిని విజేతగా ప్రకటిస్తారు. ఒకవేళ 14 గేమ్ల తర్వాత కూడా స్కోరు సమంగా ఉంటే టైబ్రేకర్ ద్వారా విన్నర్ను నిర్ణయిస్తారు.
