
- జీహెచ్ఎంసీ నిర్ణయంపై సర్కారు సీరియస్
- కొద్ది రోజుల కింద వానాకాలం సహాయక చర్యల కోసం టెండర్లు
- కొద్దిమంది కాంట్రాక్టర్ల కోసం వాహనాల టెండర్లలో రూల్స్ మార్పు
- ఫిర్యాదులు, అవినీతి ఆరోపణలతో క్యాన్సిల్
హైదరాబాద్ సిటీ, వెలుగు: వర్షాకాలం సహాయక చర్యల కోసం రూ.49 కోట్లతో ఎమర్జెన్సీ మాన్సూన్ టీమ్లు, వాహనాలను సమకూర్చేందుకు చేపట్టిన టెండర్ల ప్రక్రియ ఏకపక్షంగా, కొందరు కాంట్రాక్టర్లకు లాభం చేకూర్చేలా ఉందన్న ఆరోపణలు వెల్లువెత్తుతుండడంతో సర్కారు జోక్యం చేసుకుని రద్దు చేసినట్టు తెలుస్తోంది.
జీహెచ్ఎంసీ అధికారులు ఇష్టారాజ్యంగా, నిబంధనలకు విరుద్ధంగా చేపట్టిన టెండర్ల ప్రక్రియను వెంటనే క్యాన్సిల్చేయాలంటూ అక్కడి నుంచి ఆదేశాలు వచ్చినట్టు సమాచారం. దీంతో కమిషనర్ ఆ టెండర్ల ప్రక్రియను రద్దు చేసి మళ్లీ కొత్తగా టెండర్లను పిలవాలని అధికారులను ఆదేశించినట్లు తెలిసింది.
అధికారుల అవినీతి ప్లాన్ విఫలం
టెండర్ల రద్దుతో వర్షాకాలం సహాయక చర్యల పేరిట బల్దియా ఖజనానాకు కన్నం వేయాలని కొందరు అధికారులు, ఇంజినీర్ల కుట్ర విఫలమైందని పలువురు కామెంట్చేస్తున్నారు. సహాయక చర్యల కోసం వినియోగించే వాహనాల్లో కేవలం ఇసుజు వాహనాలను మాత్రమే వినియోగించాలన్న నిబంధన పెట్టడం, ప్రతి సంవత్సరం వర్షాకాలంలో సహాయక చర్యల కోసం వినియోగించే వాహనానికి నెలకు రూ. 30 వేలు చొప్పున చెల్లిస్తుండగా, ఈ సారి ఇసుజు వాహనాలను వినియోగించాలని, ఒక్కో వాహనానికి నెలకు రూ.62,500 అద్దెను నిర్ణయించడం వెనక అవినీతి కోణం దాగి ఉందని పలువురు బహిరంగంగానే విమర్శించారు.
అంతేగాక, వర్షాకాలం వరకు మాత్రమే కాకుండా ఏడాది పొడువున వాహనాల ఎంగేజ్ చేసేందుకు అధికారులు నిబంధనలను మార్చి దోపిడీకి బాట వేశారని, అది బట్టబయలై టెండర్ల రద్దుకు కారణమైందంటున్నారు.
రద్దుతో సమస్య మొదటికి..
వర్షాలు వస్తే సహాయక చర్యల కోసం ఇప్పటి వరకు బల్దియా పరిధిలోని ఆరు జోన్లలో 159, మరో 155 ఎమర్జెన్సీ టీమ్ లు, స్టాటిక్ లేబర్ టీమ్ లతో పాటు 164 వాహనాలను సమకూర్చుకోవాల్సి ఉంది. అయితే, టెండర్లు రద్దు అవుతుండడంతో ప్రక్రియ మళ్లీ మొదటికొచ్చినట్టయింది. ఇది వర్షాకాలం కావడం, మరో రెండు మూడు రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో సహాయక చర్యల కోసం ఏం చేస్తారన్నది తెలియడం లేదు.
నగరంలో ప్రతిసారి భారీ వర్షం పడితే ముంపునకు గురయ్యే లోతట్టు ప్రాంతాలు ఎన్నో ఉన్నాయి. మరి ఇవన్ని చోట్ల ఏం చేస్తారన్నది అధికారులు స్పష్టం చేయడం లేదు. ఇప్పటికిప్పుడు వర్షం దంచి కొడితే కాంట్రాక్టర్లను బతిమాలి సహాయక చర్యలు చేపట్టేందుకు అధికారులు, ఇంజినీర్లు
సిద్దమైనట్లు సమాచారం.
ఎమ్మెల్సీ కవితకు కాంట్రాక్టర్ల థాంక్స్
జీహెచ్ఎంసీ మాన్సూన్ ఎమర్జెన్సీ వెహికల్స్ టెండర్ల అవకతవకలపై సీఎం రేవంత్ రెడ్డికి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత లెటర్ రాయడం వల్లే సర్కారు రద్దు చేసిందంటూ సోమవారం పలువురు కాంట్రాక్టర్లు ఆమెకు థాంక్స్చెప్పారు. ఇసుజు వాహనాలు కావాలని టెండర్లలో పొందుపర్చడం వల్ల బల్దియాపై రూ. ఐదు కోట్లకు పైగా భారం పడుతోందని, కొద్ది మంది కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూర్చేలా అధికారులు టెండర్లను పిలిచారంటూ ఎమ్మెల్సీ కవిత సీఎంకు లెటర్ రాశారన్నారు. అందుకే టెండర్లు రద్దయ్యాయని ఆనందం వ్యక్తం చేశారు. కవితను పూలమాలతో సత్కరించారు. యూపీఎఫ్ కన్వీనర్ బొల్లా శివ శంకర్, కో ఆర్డినేటర్ అలకుంట హరి తదితరులు పాల్గొన్నారు.