న్యూఢిల్లీ: ప్రస్తుత రాజకీయాలను చూస్తుంటే బాధేస్తోందని కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ అన్నారు. ప్రజలను కుల, మత, ప్రాంతాల వారీగా విభజించడంలో అన్ని రాజకీయ పార్టీలూ బిజీగా ఉన్నాయని చెప్పారు. అందుకే రాజకీయాలను వదిలి.. సమాజంలో నిజమైన మార్పు తీసుకురావాలని తనకు అనిపిస్తూ ఉంటుందన్నారు. సమాజంలో అవసరమైన మార్పు తీసుకొచ్చేందుకు కీలక పాత్ర పోషించాలని ఉందన్నారు. తద్వారా పాలిటిక్స్ నుంచి రిటైర్మెంట్ దిశగా తన ఆలోచనలు సాగుతున్నట్లు ఆజాద్ హింట్ ఇచ్చారు.
‘సమాజంలో మనం మార్పు తీసుకురావాల్సి ఉంది. రాజకీయాలను వదిలి, సమాజ సేవలో నిమగ్నమైనట్లు అప్పుడప్పుడు నాకు అనిపిస్తూ ఉంటుంది’ అని ఆజాద్ అన్నారు. దీంట్లో పెద్ద విశేషమేం లేదని.. ఆ దిశగా తనకు ఆలోచనలు ఉన్నాయని బయటపెట్టారు. ప్రస్తుత దేశ రాజకీయాలపై గులాం నబీ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ‘పార్టీలు ప్రజల్ని కుల, మత, ప్రాంతాల ప్రాతిపదికన విభజించాయి. దళితులు, అగ్రకులాలు, హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు, సిక్కులుగా అడ్డుగోడలు కడుతున్నాయి. ప్రజల్ని ఏదో విధంగా విభజించుకుంటూ పోతే ఒక్కరైనా మనుషులుగా మిగులుతారా? పొలిటికల్ పార్టీలు ఇలాంటి విభజనను పెంచుకుంటూ పోతున్నాయి. ఇలాంటి క్లిష్ట సమయాల్లో ప్రజల మధ్య ఉంటూ, వారికి సరైన దిశానిర్దేశనం చేయాల్సిన అవసరం చాలా ఉంది’ అని ఆజాద్ పేర్కొన్నారు.
మరిన్ని వార్తల కోసం