గులాం నబీ ఆజాద్ ఇవాళ కొత్త పార్టీని ప్రకటించనున్నారు. త్వరలో జరగనున్న జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటేందుకు సిద్ధమయ్యారు. అందుకే భారీ ర్యాలీ నిర్వహిస్తున్నారు. ఈ ర్యాలీలోనే కొత్త పార్టీని ప్రకటించే అవకాశం ఉంది. ఆజాద్ పీడీపీ లేదా ప్రాంతీయ పార్టీలతో పొత్తు పెట్టుకునే ఛాన్స్ ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. బీజేపీతో మాత్రం పొత్తు పెట్టుకోబోమని ఆజాద్ స్పష్టం చేశారు.
ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామ చేసిన ఆజాద్ రాహుల్ గాంధీపై తీవ్ర విమర్శలు చేశారు. రాహుల్ అపరిపక్వత, రాజకీయ అనుభవం లేదని విమర్శలు చేశారు. యూపీఏ ప్రభుత్వ సంస్థాగత సమగ్రతను కూల్చివేసిన రిమోట్ కంట్రోల్ మోడల్ను పార్టీకి అన్వయించినందుకు పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి లేఖ రాశారు. పార్టీలో కీలక నిర్ణయాలు రాహుల్ తీసుకుంటున్నారని, లేకపోతే ఆయన సెక్యూరిటీ గార్డులు, పీఏలు మరింత దారుణమైన నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆయన ఆరోపించారు.
ఆజాద్ కాంగ్రెస్ పార్టీకి చెందిన జీ23 గ్రూపులో ముఖ్యమైన సభ్యుడిగా ఉండేవారు. కాంగ్రెస్ కు రాజీనామా చేసిన తరువాత జమ్మూకశ్మీర్లో జాతీయ స్థాయి పార్టీని ఏర్పాటు చేస్తానని ఆజాద్ తెలిపారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తామని ప్రకటించారు. ఆయనకు మద్దతుగా కాంగ్రెస్ కు చెందిన పలువురు నాయకులు ఆ పార్టీకి రాజీనామా చేసి ఆజాద్ చెంతకు చేరారు.