చిన్ని మనసును అర్థం చేసుకుని అడిగింది చేసి పెట్టడం అంటే మామూలు విషయం కాదు. అయితే మోడర్న్ పేరెంట్స్ పిల్లల్ని ఈజీగా పెంచేస్తున్నారా? అనిపిస్తుంది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఫోన్ లేదా ఏదో ఒక స్క్రీన్ అలవాటు చేయడం. వాళ్లను అలా ఒంటరిగా స్క్రీన్కి వదిలేసి తమ పనులు చక్కబెట్టుకోవడం, ప్రతి చిన్న దానికి లంచంగా స్క్రీన్ టైం ఆశ చూపడం వంటివి చేస్తున్నారు. దీనివల్ల పేరెంట్స్ రిలాక్స్ అవుతున్నారు. కానీ, పిల్లల మానసిక, శారీరక ఎదుగుదల అక్కడే ఆగిపోతుందని గ్రహించట్లేదు. స్క్రీన్ ఆశ చూపడం లంచంగా పరిగణిస్తున్నారు పిల్లల మనసెరిగిన పీడియాట్రిషన్లు.
ఒకటి నుంచి మూడు సంవత్సరాల మధ్య వయసున్న పిల్లల్లో ఈ మధ్యకాలంలో ఎక్కువగా కనిపిస్తున్న సమస్య స్ర్కీన్ బ్రైబ్. నిజానికి ఇదొక ట్రాప్. పిల్లలకు ఫుడ్ తినిపించడానికి స్క్రీన్ చూపిస్తున్నారు. స్నానం చేయించాలన్నా, రెడీ చేయాలన్నా వాళ్లు మాట వినకపోతే స్క్రీన్ ఆశ చూపిస్తున్నారు. పిల్లలు అడిగింది వెంటనే ఇవ్వకపోయినా, చేయకపోయినా, కాసేపు ఆగమన్నా వినరు, వెంటనే ఏడుస్తారు. అప్పుడు వాళ్ల ఏడుపును ఆపేందుకు తల్లిదండ్రులు చేసే పని మొబైల్ ఫోన్ లేదా ట్యాబ్ చేతికి ఇవ్వడం. దీన్నే స్క్రీన్ బ్రైబ్ అంటారు. ‘ఈ పని చేస్తే స్క్రీన్ ఇస్తాను’ అనడం, ‘ఏడుపు ఆపడానికి స్క్రీన్ చేతికి ఇవ్వడం’ వంటివి.
అయితే పిల్లల ఏడుపు ఆపడానికి లేదా వాళ్లతో పనిచేయించడానికి ఇది టెంపరరీ సొల్యూషన్ మాత్రమే. కానీ, తర్వాత ఇదే అలవాటైపోతుంది. ప్రతి చిన్న దానికి పిల్లలు స్క్రీన్ కావాలని డిమాండ్ చేస్తారు.
లంచం (బ్రైబ్) లేకుండా ఏమీ చేయడు. ఇలా చేయడం వల్ల పిల్లల్లో మానసిక అభివృద్ధి, ఎమోషనల్ బ్యాలెన్స్, సెల్ఫ్ మోటివేషన్, సోషల్ స్కిల్స్, ఫిజికల్ యాక్టివిటీస్ ఆడే సామర్థ్యం, లాంగ్వేజ్ స్కిల్స్, రియల్ వరల్డ్ ఎక్స్పీరియెన్స్ వంటివి ఉండవు. వీటన్నింటినీ స్క్రీన్ దొంగలిస్తున్నట్టే. ముఖ్యంగా పిల్లలు స్క్రీన్ ఎక్కువగా చూస్తుంటే భాష నేర్చుకోవడం లేట్ అవుతుంది. ఫోకస్ తగ్గుతుంది. ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోలేకపోతారు. స్క్రీన్ తీసేస్తే పెద్దగా ఏడుస్తారు. దీనివల్ల డిపెండెన్సీ అలవాటవుతుంది. ఇలా చేయడం వల్ల తల్లిదండ్రులు పిల్లలకు ప్రతిసారీ లంచం ఇవ్వాల్సి వస్తుంది. లంచం కోసమే మాట వినేలా తయారవుతారు. లాంగ్రన్లో పిల్లల్ని పెంచడం తల్లిదండ్రులకు కష్టమవుతుంది. కాబట్టి లంచం ఇవ్వడానికి బదులు ముందే నిర్ణయించి, పని పూర్తయ్యాక రివార్డ్ ఇవ్వాలి. ఉదాహరణకు ఫుడ్ కంప్లీట్ చేస్తే కథ చెప్తాను, పాట పాడతాను వంటివి. ఓపికతో బౌండరీస్ సెట్ చేయాలి. వాళ్లు ఏడుస్తున్నప్పుడు నెమ్మదిగా ఆలోచించి ఎమోషన్స్ని గుర్తించి సపోర్ట్ ఇవ్వాలి. స్క్రీన్ టైం తగ్గించాలి. రెండేళ్లలోపు పిల్లలకు దాదాపు జీరో స్క్రీన్, రెండు నుంచి ఐదేండ్ల పిల్లలకు ఒక గంట కంటే తక్కువసేపు ఇవ్వాలి. అది కూడా తల్లిదండ్రులతో కలిసి చూడడం బెటర్. ముఖ్యంగా పిల్లలు బయట ఆడుకోవడానికి, పుస్తకాలు చదవడానికి ప్రోత్సహించాలి. ఇవి వాళ్ల ఎదుగుదలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి.
