పనాజీ: డ్రగ్స్ తీసుకునే వాళ్లు గోవాకు రావొద్దని ఆ రాష్ట్ర టూరిజం శాఖ మంత్రి మనోహర్ అజ్గోంకర్ అన్నారు. ముంబై డ్రగ్స్ కేసులో అరెస్టయిన బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ కేసు గురించి విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా అజ్గోంకర్ పైవ్యాఖ్య చేశారు. డ్రగ్స్ వినియోగించే టూరిస్టుల విషయంలో గోవా ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని ఆయన స్పష్టం చేశారు.
‘డ్రగ్స్ తీసుకుని గోవా సంస్కృతిని పాడుచేసే టూరిస్టులు మాకొద్దు. గోవాకు వచ్చి బస్సు లోపల వంట వండుకునే పర్యాటకులు మాకొద్దు. మాకు రిచ్ టూరిస్టులు కావాలి. అందరు టూరిస్టులకు మేం స్వాగతం చెబుతున్నాం. వాళ్లు ఎంజాయ్ చేస్తూనే ఇక్కడి కల్చర్ను గౌరవించాలి. మా ప్రభుత్వం డ్రగ్స్కు పూర్తి వ్యతిరేకం’ అని అజ్గోంకర్ అన్నారు. డ్రగ్స్ తీసుకోవడానికే కొందరు టూరిస్టులు గోవాకు వస్తున్నారా అని అడిగిన క్వశ్చన్కు.. ఇది తన చేతుల్లో లేదని అజ్గోంకర్ చెప్పారు. ఈ విషయాలను హోం శాఖ చూసుకుంటుందన్నారు. గోవా నుంచి డ్రగ్స్ను పారదోలడమే ధ్యేయంగా తాము కృషి చేస్తున్నామని పేర్కొన్నారు.