గోదావరిఖనిలో ఉత్సాహంగా సింగరేణి హాకీ పోటీలు..వర్క్ పీపుల్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అసోషియేషన్ నిర్వహణ

గోదావరిఖనిలో ఉత్సాహంగా సింగరేణి హాకీ పోటీలు..వర్క్ పీపుల్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అసోషియేషన్ నిర్వహణ

గోదావరిఖని, వెలుగు: గోదావరిఖనిలోని జవహర్​లాల్​ నెహ్రూ స్టేడియంలో మంగళవారం వర్క్ పీపుల్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అసోషియేషన్ ఆధ్వర్యంలో సింగరేణి కంపెనీ లెవల్​ హాకీ పోటీలు జరిగాయి. ఆర్జీ 1 ఏరియా జీఎం డి.లలిత్​ కుమార్​ ఆటలను ప్రారంభించారు. 

ఉదయం సెషన్​లో ఆర్జీ 1, 2(గోదావరిఖని), కొత్తగూడెం కార్పొరేట్​ జట్ల మధ్య మ్యాచ్​ జరగ్గా.. ఆర్జీ 1, 2 టీం గెలుపొందింది. ఆ తర్వాత భూపాలపల్లి, మణుగూరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్​ డ్రా అయింది. 

మధ్యాహ్నం సెకండ్​ సెషన్​లో ఆర్జీ 1, 2, బెల్లంపల్లి జట్ల మధ్య పోటీ జరగగా బెల్లంపల్లి జట్టు మూడు పాయింట్లతో గెలుపొందింది. శ్రీరాంపూర్, మణుగూరు జట్ల మధ్య జరిగిన పోటీలో మూడు పాయింట్లతో శ్రీరాంపూర్​ జట్టు నెగ్గింది. పోటీల్లో ప్రతిభ చాటిన క్రీడాకారులను శాలువాలతో సన్మానించి పూల బొకేలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ డిప్యూటీ జనరల్ సెక్రటరీ మడ్డి ఎల్లయ్య, ఎస్ వో టు జీఎం కె.చంద్రశేఖర్, పర్సనల్ మేనేజర్ ఎం.రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.