- ప్రతి నలుగురిలో ముగ్గురిది ఇదే ఆలోచన అంటున్న గోద్రేజ్ హౌసింగ్ ఫైనాన్స్ స్టడీ
- ఇల్లు తీసుకోవడం భవిష్యత్కు భరోసాగా భావిస్తున్నారు
హైదరాబాద్, వెలుగు: దేశంలోని ప్రతి నలుగురిలో ముగ్గురు ఇళ్లను రెంట్కు తీసుకోవడం కంటే కొనడానికే ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారని గోద్రేజ్ హౌసింగ్ ఫైనాన్స్ స్టడీ వెల్లడించింది. కరోనా సంక్షోభంతో ప్రజల ఆలోచన విధానాలు మారాయని, ఇంటిని కొనుక్కోవడం వలన భవిష్యత్లో భరోసా ఉంటుందని భావిస్తున్నారని పేర్కొంది. రానున్న నెలల్లో కూడా హౌసింగ్ సెగ్మెంట్లో డిమాండ్ కొనసాగుతుందని అంచనావేసింది. పోస్ట్ ‘జనరేషన్–రెంట్’ పేరుతో ఈ స్టడీని గోద్రేజ్ హౌసింగ్ ఫైనాన్స్ విడుదల చేసింది. ఈ స్టడీ ప్రకారం, ఏదైనా ప్రాపర్టీలో ఇన్వెస్ట్ చేయడానికి కన్జూమర్లు ఆసక్తి చూపిస్తున్నారు.
‘జనరేషన్ –రెంట్’ గా పిలిచే ప్రస్తుత జనరేషన్ ఆలోచన విధానాల్లో మార్పొచ్చిందని ఈ స్టడీ పేర్కొంది. 62% మంది రెస్పాండెంట్లు ఫర్నిచర్, కారు, హోమ్, పెళ్లి దుస్తులు వంటి వాటిని రెంట్కు తీసుకోవడం కంటే కొనడానికే ఎక్కువ ఆసక్తి చూపించారు. కొనుక్కోవడం వలన ఫ్యూచర్లో స్టెబిలిటీ ఉంటుందని వీరు భావిస్తున్నారు. ప్రతి ఇద్దరిలో ఒకరు ఇల్లు కొనుక్కోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందు కోసం లోన్ తీసుకోవడానికి హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీల వద్దకు వెళుతున్నారు. సర్వేలో పాల్గొన్న వారిలో 32.9 శాతం మంది ఇంటిని మంచి ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్గా చూస్తున్నారు.
వర్క్ ఫ్రమ్ హోం పెరగడంతో ఇల్లు తీసుకోవడం ముఖ్యమని 16 శాతం మంది అన్నారు. అంతేకాకుండా 25.5 శాతం రెస్పాడెంట్లు జాబ్ తర్వాత ఇల్లు చాలా ముఖ్యమైనదిగా భావిస్తున్నారని ఈ సర్వే వెల్లడించింది. జాబ్ సెక్యూరిటీ ఉండాలని 40.6 శాతం మంది పేర్కొన్నారు.
లోన్ తీసుకొని ఇల్లు కొనడం..
కరోనా సంక్షోభం తర్వాత కన్జూమర్ల ఆలోచన విధానాలు మారుతున్నాయని గోద్రేజ్ హౌసింగ్ ఫైనాన్స్ ఎండీ అండ్ సీఈఓ మనిష్ షా పేర్కొన్నారు. భవిష్యత్కి భరోసా ఇచ్చే వాటిలో ఇన్వెస్ట్ చేయాలని చూస్తున్నారని చెప్పారు. ‘ప్రస్తుతం అఫోర్డబుల్ ధరల్లోనే ఇండ్లు అందుబాటులో ఉన్నాయి. ఇల్లు కొనడానికి ఇంతకంటే మంచి టైమ్ దొరకదు. ఇన్వెస్ట్మెంట్గా చూసినా, ఫైనాన్షియల్ సెక్యూరిటీగా చూసినా, ఇల్లు ముఖ్యమైనది’ అని మనిష్ అభిప్రాయపడ్డారు. ఈ లాంగ్ టెర్మ్ కమిట్మెంట్ను సపోర్ట్ చేయడానికి, మంచి సలహాలు ఇవ్వడానికి ఫైనాన్షియల్ పార్టనర్ అవసరమని కస్టమర్లు భావిస్తున్నారని చెప్పారు.
కస్టమర్లకు ఫైనాన్సింగ్ ఇవ్వడంలో ఇన్నొవేషన్స్ను, డిజిటల్ ప్రొడక్ట్లను తీసుకురావాలనే అంశాన్ని ఈ స్డడీ సపోర్ట్ చేసింది.హౌసింగ్ ఫైనాన్సింగ్ కంపెనీని ఎంచుకోవడంలో కంపెనీ బ్రాండ్ క్రెడిబిలిటీకి, లోన్ పాలసీలో ఫ్లెక్సిబిలిటీకి కన్జూమర్లు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారని ఈ సర్వే వెల్లడించింది. అంతేకాకుండా ఆన్లైన్ ప్రాసెస్కు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారని తెలిపింది. ఫైనాన్సింగ్ కంపెనీలను ఎంచుకునేముందు ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకుంటున్నారని వివరించింది. కస్టమర్లను ఆకర్షించడంలో ఎండ్ టూ ఎండ్ డిజిటల్ సొల్యూషన్లను అందించే కంపెనీలకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయని పోస్ట్ ‘జనరేషన్పే–రెంట్’ సర్వే పేర్కొంది.