వెలుగు బిజినెస్ డెస్క్: కరోనా వైరస్ కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో బంగారం కొనేవాళ్లు కరువవుతున్నారు. పెళ్లిళ్లు, ఇతర ఫంక్షన్లపై ఆంక్షలు పెడుతుండటంతో గోల్డ్కి డిమాండ్ మళ్లీ తగ్గుతోంది. మన దేశంలో బంగారం డిమాండ్ పెరగడానికి ముఖ్య కారణాలలో పెళ్లిళ్లు కూడా ఒకటి. జనవరి రెండో వారంలో మొదలయ్యే పెళ్లిళ్ల సీజన్ మే నెల దాకా కొనసాగుతుంది. దేశంలో కరోనా వైరస్ కొత్త కేసులు గురువారం నాటికి 2 లక్షలకు చేరాయి. దీంతో చాలా రాష్ట్రాలు నైట్ కర్ఫ్యూతోపాటు, పగటి పూటా కొన్ని ఆంక్షలు పెడుతున్నాయి. ఫలితంగా ఫంక్షన్లను భారీగా జరుపుకోవడం వీలవడం లేదు. ఈ నేపథ్యంలో పెళ్లిళ్ల సీజనైనా బంగారం కొనడానికి కొనుగోలుదారులు ఎక్కువ ఉత్సాహం చూపించడం లేదని పరిశ్రమ వర్గాలు చెఈబుతున్నాయి.
కరోనా వైరస్ భయం ప్రజలలో మళ్లీ పెరిగిన నేపథ్యంలో రిటెయిల్ స్టోర్లకు రావడానికి జంకుతున్నారని ఆల్ ఇండియా జెమ్ అండ్ జ్యుయెలరీ డొమెస్టిక్ కౌన్సిల్ ఛైర్మన్ ఆశిష్ పీఠె చెప్పారు. మార్చితో ముగిసే ఈ క్వార్టర్లో బంగారం డిమాండ్ నెమ్మదిస్తుందని అంచనా వేస్తున్నట్లు పేర్కొన్నారు. బంగారం అమ్మకాలు 2021 సెకండ్ హాఫ్లోనే పుంజుకున్నాయి. ఆ ఏడాది బంగారం దిగుమతులు ఆరేళ్ల గరిష్టానికి చేరాయంటే డిమాండ్ ఏ రేంజ్లో పెరిగిందో ఊహించొచ్చు. కరోనా వైరస్ సంబంధ ఆంక్షలు తొలగిపోవడం వల్లే పసిడి డిమాండ్కు రెక్కలొచ్చాయి. కరోనా వైరస్వల్ల చాలా మంది పెళ్లిళ్లను రెండేళ్లపాటు వాయిదా వేసుకోవలసి వచ్చింది.
తాజా వేవ్లో అమ్మకాలు మరీ ఎక్కువగా తగ్గకపోవచ్చని, ఎందుకంటే చాలా రాష్ట్రాలు షాపులను మూసివేయడానికి అంతగా ఆసక్తి చూపించడం లేదని యూటీ జవేరి స్టోర్ ఓనర్ కుమార్ జైన్ చెప్పారు. కొంత మంది పెళ్లిళ్లను వాయిదా వేసుకోవడం లేదని, అవసరమనుకుంటే ఆంక్షలు తక్కువగా ఉన్న రాష్ట్రాలలో పెళ్లిళ్లు జరుపుతున్నారని పేర్కొన్నారు.మార్చి 2021 క్వార్టర్లో దేశంలో బంగారం అమ్మకాలు 37 శాతం ఎగసి 140 టన్నులకు చేరినట్లు వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ డేటా చెబుతోంది. 2021 పూర్తి ఏడాదికి డబ్ల్యూజీసీ ఇంకా డేటా విడుదల చేయలేదు. 2020 నాటి పెంటప్ డిమాండ్ కొంత 2021లో పూర్తయిందని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. 2022లో గోల్డ్ డిమాండ్ 750 టన్నుల దాకా ఉండొచ్చని పీఠె అన్నారు. బహుశా మార్చి నెల నుంచి పరిస్థితులలో కొంత మార్పు రావచ్చని పేర్కొనారు.
బంగారం రేటు పెరగొచ్చు.. డబ్ల్యూజీసీ అంచనా
సెంట్రల్ బ్యాంకుల నుంచి, జ్యుయెలరీ మార్కెట్ల నుంచి వచ్చే డిమాండ్ 2022లో స్థిరంగా ఉంటుందని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (డబ్ల్యూజీసీ) అంచనా వేస్తోంది. ఇన్ఫ్లేషన్ ఎక్కువగా ఉండటంతో హెడ్జింగ్ సాధనంగానూ గోల్డ్లో పెట్టుబడులు పెరుగుతాయని పేర్కొంది. 2021 చివరిలో బంగారం రేట్లలో కొంత ర్యాలీ వచ్చినా, 2020 తో పోలిస్తే 4 శాతం తగ్గి ఔన్సుకి 1806 డాలర్లకు చేరాయని డబ్ల్యూజీసీ తాజాగా విడుదల చేసిన అవుట్లుక్2022లో తెలిపింది. ఈ ఏడాది యూఎస్ గవర్నమెంట్ వడ్డీ రేట్లను పెంచనుంది. యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ మాత్రం వడ్డీ రేట్లను ఇప్పటిలో పెంచే ఉద్దేశంలో లేదు.మరోవైపు ఎకానమీ రికవరీ కోసం మానిటరీ పాలసీని కొంత సరళంగానే అట్టేపెట్టాలనే ఆలోచనను ఆర్బీఐ కనబరుస్తోంది. ఇన్ఫ్లేషన్ ఎక్కువున్న ప్రతిసారీ బంగారం రేట్లు పైనే ఉండటం సాధారణంగా జరుగుతోందని, గ్లోబల్గా ఈ ఏడాది ఇన్ఫ్లేషన్ ఎక్కువగా ఉండే అవకాశాలున్నాయని డబ్ల్యూజీసీ చెబుతోంది.