న్యూఢిల్లీ: ఇంగ్లండ్ టూర్కు బయలుదేరనున్న ఇండియా మెన్స్, విమెన్స్ క్రికెట్ టీమ్లకు గుడ్న్యూస్. ఇండియా జట్లు మూడు రోజులు మాత్రమే క్వారంటైన్లో ఉండేందుకు ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) ఓకే చెప్పింది. ఈ మేరకు కరోనా ప్రొటోకాల్స్ను సడలించింది. మొత్తానికి బీసీసీఐ చేసిన మంత్రాంగం ఫలించడంతో క్రికెటర్లకు 10 రోజుల హార్డ్ క్వారంటైన్ గండం తప్పింది. ఫలితంగా లండన్లో దిగిన నాలుగో రోజు నుంచే ఇండియన్ టీమ్లు ప్రాక్టీస్ను మొదలుపెట్టనున్నాయి. జూన్ 2న చార్టెడ్ ఫ్లైట్స్లో యూకే బయలుదేరనున్న రెండు జట్లలో.. విరాట్సేన డైరెక్ట్గా సౌతాంప్టన్ వెళ్తుంది. ఏజెస్ బౌల్ గ్రౌండ్లో ఉన్న హోటల్లో మూడు రోజులు క్వారంటైన్లో ఉంటుంది. ఇక విమెన్స్ టీమ్.. బ్రిస్టల్కు వెళ్తుంది. అక్కడ జూన్ 16 నుంచి ఇంగ్లండ్ విమెన్స్ టీమ్తో ఏకైక టెస్ట్ మ్యాచ్ ఆడుతుంది. ఇక ఇవే రూల్స్ను క్రికెటర్ల ఫ్యామిలీకి కూడా వర్తింపజేయాలని బీసీసీఐ.. యూకే గవర్నమెంట్ అథారిటీస్ను కోరింది. అయితే ప్లేయర్ల వరకు పర్మిషన్ ఇచ్చిన అథారిటీస్.. ఫ్యామిలీల విషయంలో ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఈ విషయంపై ఇండియన్ బోర్డు ఇంకా సంప్రదింపులు చేస్తోంది. ప్రస్తుతం క్రికెటర్లతో పాటు వాళ్ల ఫ్యామిలీ మెంబర్స్ కూడా ముంబైలోని బబుల్లోఉన్నారు. ఇక షెడ్యూల్ విషయానికొస్తే.. జూన్ 18– 22 వరకు న్యూజిలాండ్తో జరిగే వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ ఫైనల్ అనంతరం. ఆగస్టులో మొదలయ్యే సిరీస్లో ఇండియా, ఇంగ్లండ్తో ఐదు టెస్ట్ మ్యాచ్లు ఆడుతుంది.
నేడు టీమ్ బబుల్లోకి ప్రసిధ్
ఇంగ్లండ్ టూర్కు స్టాండ్ బై బౌలర్గా ఎంపికైన పేసర్ ప్రసిధ్ కృష్ణ.. నేడు మిగిలిన జట్టుతో కలవనున్నాడు. ఐపీఎల్-14లో భాగంగా కరోనా బారిన పడిన ప్రసిధ్ ఇటీవల రికవర్ అయ్యాడు. దీంతో ఆదివారం బెంగళూరు నుంచి బయలుదేరి ముంబైలో ఉన్న టీమ్ బబుల్లోకి వెళ్లనున్నాడు. ‘ప్రసిధ్ కంప్లీట్గా రికవర్ అయ్యాడు. ప్రస్తుతం బెంగళూరులోని ఇంట్లో ఉన్నాడు. ఆదివారం ముంబై బయలుదేరుతాడు. అక్కడి నుంచి టీమిండియా బబుల్లోకి వెళ్తాడు’ అని క్రికెటర్కు చెందిన వర్గాలు తెలిపాయి.