
న్యూఢిల్లీ: గూగుల్ మరో 30 వేల మంది ఉద్యోగులను తీసేయాలని చూస్తోంది. ఈ ఏడాది 12 వేల మందిని ఈ టెక్ కంపెనీ తొలగించింది. ఒకేసారి ఇంత మందిని తీసేయడం కంపెనీకి ఇదే మొదటిసారి. ఇంత కంటే ఎక్కువ మందిని నెక్స్ట్ రౌండ్లో గూగుల్ తొలగించనుందని రాయిటర్స్ రిపోర్ట్ చేసింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) డెవలప్ అవుతుండడంతో ఉద్యోగులను తగ్గించుకోవాలని చూస్తోంది.
ఏఐ చేయగలిగే పనులు పెరగడంతో యాడ్ సేల్స్ డిపార్ట్మెంట్లో ఉద్యోగులను తగ్గించుకోవాలని ఈ టెక్ కంపెనీ చూస్తోందని రాయిటర్స్ వెల్లడించింది. కస్టమర్ సర్వీస్ డిపార్ట్మెంట్లో ఉద్యోగులను తొలగించే అవకాశం ఉందని పేర్కొంది. ‘ఈ ఇష్యూకి సంబంధించి గూగుల్ యాడ్స్ మీటింగ్లో కంపెనీ చర్చించింది. ‘ఏఐతో పనిచేసే యాడ్స్’ సెగ్మెంట్ను కంపెనీ తీసుకొచ్చిన తర్వాత ఈ లేఆఫ్స్ వార్తలు వచ్చాయి’ అని రాయిటర్స్ వెల్లడించింది.
గూగుల్ తెచ్చిన ఏఐ యాడ్స్ ఇనీషియేటివ్ వెబ్సైట్లను స్కాన్ చేసి యాడ్స్ కోసం ఆటోమేటిక్గా కీవర్డ్స్, హెడ్లైన్స్, ఇమేజెస్ను జనరేట్ చేస్తుంది. గత కొన్ని సంవత్సరాలుగా ఏఐ టూల్స్ హాట్ టాపిక్గా మారాయి. ఏఐ డివిజన్ గూగుల్ ఏఐను కంపెనీ తీసుకొచ్చింది. ఏఐ టూల్స్తో కార్యకలాపాలను ఎలా సులభం చేసుకోవాలనే దానిపై రీసెర్చ్ చేస్తోంది. టెక్నాలజీలో పెద్ద మార్పు వస్తోందని, ఉద్యోగులను తగ్గించుకోకపోతే నష్టం వస్తుందని గూగుల్ సీఈఓ సుందర్ పిచయ్ గతంలో పేర్కొన్నారు.