14 రోజులు ఇంట్లోనే..
కరోనా లక్షణాలు లేకున్నాహోమ్ క్వారంటైన్ తప్పనిసరి
ఆరోగ్య కార్యకర్తలకు ‘గమనించే బాధ్యత’
అనుమానమొస్తే దవాఖానాకు…
హైదరాబాద్, వెలుగు: దేశంలో ‘కరోనా’ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో విదేశాల నుంచి ఎవరొచ్చినా14 రోజులు హోమ్ ఐసోలేషన్లో ఉంచాలని సర్కారు నిర్ణయించింది. ఇప్పటివరకూ వైరస్ లక్షణాలు ఉన్నవారినే ఐసోలేషన్లో ఉంచుతుండగా, ఇకపై లక్షణాలతో సంబంధం లేకుండా అందరినీ హోమ్ ఐసోలేషన్లో పెట్టనున్నారు. వైరస్ సోకిన వ్యక్తికి లక్షణాలు బయటపడడానికి 2 నుంచి 14 రోజుల సమయం పడుతోంది. ఈ నేపథ్యంలో కేంద్రం సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. క్వారంటైన్ బాధ్యతలను ఫీల్డ్లెవెల్ ఆరోగ్య కార్యకర్తలకు అప్పగించనున్నరు. వీరు 14 రోజుల పాటు క్వారంటైన్లో ఉన్న వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుంటూ, లక్షణాలు బయటపడితే దవాఖానాలకు తరలిస్తారు.
హైదరాబాద్ వచ్చిన ఢిల్లీ టీం
వైరస్ వ్యాపిస్తున్న నేపథ్యంలో ఢిల్లీ నుంచి డాక్టర్ల బృందం గురువారం హైదరాబాద్కు వచ్చింది. సెక్రటేరియట్లో ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ తో పాటు స్టేట్ హెల్త్ ఆఫీసర్లతో సమావేశమయ్యారు. మంత్రి ఈటల మాట్లాడుతూ విదేశాల నుంచి వచ్చిన వారి కుటుంబ సభ్యులు ముందుజాగ్రత్త చర్యగా కుటుంబసభ్యులను, బయటి వ్యక్తులను కలవొద్దని సూచించారు. ఆరోగ్యశాఖ నుంచి కాల్స్ వస్తే అన్ని వివరాలు చెప్పాలని కోరారు.
సభలు, సమావేశాలు వద్దు
కరోనా భయం పోయేవరకూ సభలు, సమావేశాలు నిర్వహించొద్దని మంత్రి ఈటల విజ్ఞప్తి చేశారు. సోషల్ మీడియాలో కరోనాపై వదంతులను ప్రచారం చేస్తున్న వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని డీజీపీ మహేందర్రెడ్డిని కోరారు. ప్రస్తుతం గాంధీలో కరోనా బాధితుడు పూర్తిగా కోలుకున్నాడని, త్వరలోనే ఆయన్ను డిశ్చార్జ్ చేయబోతున్నామని మంత్రి వెల్లడించారు. స్పెషల్ చీఫ్ సెక్రటరీ శాంతకుమారి, పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు పాల్గొన్నారు.
For More News..