బెంగాల్లో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో TMC ఘన విజయం సాధించి.. మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ. 294 స్థానాలున్న బెంగాల్ అసెంబ్లీకి ఏప్రిల్, మే నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి.
బెంగాల్ రైతులకు పీఎం కిసాన్ లబ్ది చేకూర్చే విషయంలో కేంద్ర ప్రభుత్వం అబద్ధాలు చెబుతోందంటూ ఆరోపించారు సీఎం మమతా బెనర్జీ. రాష్ట్రంలోని రైతులకు పీఎం కిసాన్ ఇవ్వాలని తాము జాబితా పంపినప్పటికీ కేంద్రం నిధులు ఇవ్వడానికి నిరాకరించిందని విమర్శించారు. మంగళవారం పుర్బ వర్దమాన్ జిల్లాలోని కల్నాలో నిర్వహించిన సభలో మమతా బెనర్జీ కేంద్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
బీజేపీ దేశాన్ని భ్రష్టు పట్టిస్తోందన్న మమతా… బెంగాల్ను అలా కావడాన్ని మేం అనుమతించమన్నారు. మా పార్టీ ప్రజల్లో మతం, కులం ఆధారంగా విభజన రాజకీయాలు చేయదని తెలిపారు మమత. రాష్ట్రంలోని రైతులకు టీఎంసీ ప్రభుత్వం ఒక్కొక్కరికి రూ.5వేలు ఇస్తోందన్నారు. అంతేకాదు ఉచిత పంట బీమా సౌకర్యం కూడా కల్పిస్తోందని చెప్పారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మొదట రాష్ట్ర రైతులకు పీఎం కిసాన్ నిధులు ఇవ్వడానికి నిరాకరించిందని…. ఇప్పుడు టీఎంసీ ప్రభుత్వమే రైతుల్ని ఆ పథకానికి దూరం చేసిందని అబద్ధాలు చెబుతోందంటూ ఆరోపించారు మమతా బెనర్జీ.