
- అర్బన్ డెవలప్మెంట్ అథారిటీల్లో వెయ్యెకరాల చొప్పున ల్యాండ్ పూలింగ్
- మహబూబ్ నగర్కూ యూడీఏ
- ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
హైదరాబాద్, వెలుగు : సర్కారు మరోసారి రియల్ ఎస్టేట్ దందాకు తెరతీసింది. రాష్ట్రంలోని పది అర్బన్ డెవలప్మెంట్ అథారిటీల్లో వెయ్యెకరాల చొప్పున ల్యాండ్ పూలింగ్ చేయాలని టార్గెట్గా పెట్టుకుంది. కొత్తగా మహబూబ్నగర్కు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఇస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయా నగరాలు, పట్టణాలు మరింత స్పీడ్గా అభివృద్ధి చెందడానికి, గ్రీన్ కవర్ పెంచేందుకు ల్యాండ్ పూలింగ్ దోహదపడుతుందని మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ చెప్తున్నది. తమ లక్ష్యాలతో కూడిన ఉత్తర్వులను ఆయా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలకు పంపింది.
142 గ్రామాలతో మహబూబ్నగర్ యూడీఏ
గ్రేటర్ హైదరాబాద్ సహా ఏడు కార్పొరేషన్లు, 30 మున్సిపాలిటీలు, 649 గ్రామాలతో కూడిన హెచ్ఎండీఏ, గ్రేటర్ వరంగల్, 181 గ్రామాలతో కూడిన కుడా, యాదగిరిగుట్ట, ఏడు గ్రామాలతో వైటీడీఏ, వేములవాడ, ఆరు గ్రామాలతో వీటీడీఏ, కరీంనగర్ కార్పొరేషన్, 71 గ్రామాలతో శాతవాహన, నిజామాబాద్ కార్పొరేషన్, 60 గ్రామాలతో నుడా, ఖమ్మం కార్పొరేషన్ 45 గ్రామాలతో స్తంభాద్రి, సిద్ధిపేట మున్సిపాలిటీ, 21 గ్రామాలతో సుడా, నల్లగొండ మున్సిపాలిటీ, 42 గ్రామాలతో నీలగిరి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలు ఇప్పటికే ఏర్పడ్డాయి. మహబూబ్నగర్, జడ్చర్ల, భూత్పూరు మున్సిపాలిటీలు, 142 గ్రామాలతో సోమవారం మహబూబ్నగర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. హెచ్ఎండీఏలాగానే రాష్ట్రంలోని అన్ని అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీలకు ఆదాయం పెంపొందించేందుకు వెయ్యెకరాల చొప్పున భూములు సేకరించాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. ఇష్టం వచ్చినట్టుగా నిర్మాణాలు చేపట్టకుండా కంట్రోల్ చేసేందుకు, రాష్ట్ర ఆదాయానికి బూస్టింగ్ ఇచ్చేందుకు అర్బనైజేషన్కు అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీలు పని చేయాలని సూచించారు. ఆయా అథారిటీల పరిధిలో శాటిలైట్ టౌన్ షిప్స్, స్కూళ్లు, హాస్పిటళ్లు, ఫంక్షన్ హాళ్లు, రెస్టారెంట్లు, ఆఫీస్ స్పేస్ కూడిన అత్యాధునిక నగరాలు అభివృద్ధి చేయడానికి ల్యాండ్ పూలింగ్ ప్రక్రియ చేపట్టాలని ఆదేశించారు. ఆవాస ప్రాంతాలను అభివృద్ధి చేయడం, చెరువులు, కుంటలను పరిరక్షించడం, గ్రీన్ కవర్ పెంచడం, ఆయా డెవలప్ మెంట్ అథారిటీకి రింగ్ రోడ్డు తేవడం, ఉన్న రోడ్ నెట్వర్క్ అభివృద్ధి చేయడం లక్ష్యాలుగా పెట్టుకోవాలని నిర్దేశించారు.