- ఇతర ట్యాక్స్లను తొలగించాలని కేంద్రం యోచన
న్యూఢిల్లీ: ప్రభుత్వం ఫారిన్ పోర్టుఫోలియో ఇన్వెస్టర్ల (ఎఫ్పీఐల) కు బిగ్ రిలీఫ్ ఇవ్వనుంది. గవర్నమెంట్ సెక్యూరిటీలపై లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ (ఎల్టీసీజీ) ను తొలగించాలని ప్లాన్ చేస్తోంది. కేవలం ఫారిన్ ఇన్వెస్టర్లకే ఈ రిలీఫ్ ఉంటుందా లేదా డొమెస్టిక్ ఇన్వెస్టర్లకు కూడా ప్రభుత్వం ఊరటనిస్తుందా? అనే అంశంపై ఇంకా క్లారిటీ రాలేదు. క్రూడాయిల్ ధరలు పెరగడం, ఈక్విటీ మార్కెట్ల నుంచి విదేశీ పెట్టుబడులు వెళ్లిపోవడంతో డాలర్తో రూపాయి విలువ ఈ ఏడాది 5శాతం కంటే ఎక్కువ క్షీణించింది. రూపాయి పతనాన్ని అడ్డుకునేందుకు, విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోనుందని సంబంధిత వ్యక్తులు పేర్కొన్నారు.
ప్రస్తుతం 12 నెలల కంటే ఎక్కువ కాలం ఉంచుకునే బాండ్లపై వచ్చే లాభాల్లో విదేశీ ఇన్వెస్టర్లు 12.5శాతం ఎల్టీసీజీ ట్యాక్స్ చెల్లిస్తున్నారు. కేంద్రం ఎల్టీసీజీతో పాటు ప్రభుత్వ బాండ్లపై వచ్చే వడ్డీపై విదేశీ ఇన్వెస్టర్లు చెల్లించే 20శాతం విత్హోల్డింగ్ పన్నును కూడా రద్దు చేసే అవకాశం ఉంది. ఈ ప్లాన్ ఎప్పటి నుంచి అమలులోకి వస్తుందనే అంశంపై ఇంకా స్పష్టత రాలేదు. కాగా, ఈ ఏడాది విదేశీ ఇన్వెస్టర్లు భారత ఈక్విటీ మార్కెట్ల నుంచి నికరంగా 28 బిలియన్ డాలర్లను వెనక్కి తీసుకోగా, ప్రభుత్వ బాండ్లలో మాత్రం నికరంగా 1.4 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టారు. ఈ వార్త నేపథ్యంలో బుధవారం భారత బెంచ్మార్క్ బాండ్ ఈల్డ్ ఒక బేసిస్ పాయింట్ తగ్గి 7.01 శాతానికి చేరుకుంది.
