- మంత్రి ఈటలకు ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్న గవర్నర్ తమిళిసై
- ట్రేసింగ్కు యాప్ రూపొందించినట్లు మంత్రి వెల్లడి
- జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు గవర్నర్ సూచన
హైదరాబాద్ , వెలుగు: రాష్ట్రంలో కరోనా సెకండ్ వేవ్ పరిస్థితిపై గవర్నర్ తమిళిసై ఆరా తీశారు. హెల్త్ మినిస్టర్ ఈటల రాజేందర్కు ఆదివారం ఆమె ఫోన్ చేసి మాట్లాడారు. కరోనా కట్టడి, ట్రీట్ మెంట్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై మంత్రి ఈటలను వివరాలు అడిగి తెలుసుకున్నారని రాజ్ భవన్ ఒక ప్రకటనలో పేర్కొంది. టెస్టింగ్, ట్రేసింగ్, ట్రీట్ మెంట్పై ప్రభుత్వ చర్యలను గవర్నర్ కు మంత్రి వివరించారు. ట్రేసింగ్ కోసం ప్రత్యేకంగా యాప్ రూపొందించామని, హాస్పిటళ్లలో మెరుగైన ట్రీట్ మెంట్ అందిస్తున్నట్లు చెప్పారు. యాప్ ను రూపొందించినందుకు హెల్త్ డిపార్ట్మెంట్ను గవర్నర్ అభినందించారు. క్రిటికల్ గా ఉన్న వారి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని, పబ్లిక్ అలర్ట్ గా ఉండాలని గవర్నర్ తమిళిసై సూచించారు. మాస్క్ లు పెట్టుకోవాలని, సోషల్ డిస్టెన్స్ పాటించాలని, పబ్లిక్ గుమికూడవద్దని అన్నారు. ప్రైవేట్ , ప్రభుత్వ హాస్పిటళ్లలో పెద్ద సంఖ్యలో కరోనా పేషంట్లు వెంటిలేటర్ పై ఉన్నారని గవర్నర్ గుర్తుచేశారు. కరోనాను ముందే గుర్తించి, వ్యాక్సిన్ , ట్రీట్ మెంట్ అందిస్తే సీరియస్ నెస్ ను తగ్గించ వచ్చన్నారు. 45 ఏండ్లు దాటిన వాళ్లందరూ తప్పనిసరిగా వ్యాక్సిన్ తీసుకోవాలని గవర్నర్ సూచించారు. ఎండల తీవ్రత పెరుగుతున్నందున ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, జాగ్రత్తలతోనే వడదెబ్బ నుంచి తప్పించుకోవచ్చన్నారు.