ఎగుమతిదారులకు బూస్ట్ ..రూ. 45 వేల కోట్ల విలువైన పథకాలకు కేంద్రం కేబినెట్ ఆమోదం

ఎగుమతిదారులకు బూస్ట్ ..రూ. 45 వేల కోట్ల  విలువైన పథకాలకు కేంద్రం కేబినెట్ ఆమోదం

న్యూఢిల్లీ:  అన్ని రంగాల ఎగుమతులను పెంచడానికి కేంద్ర ప్రభుత్వం రెండు పథకాలకు గ్రీన్​సిగ్నల్​ఇచ్చింది. వీటికి రూ. 45 వేల కోట్లు కేటాయిస్తారు.  ఎగుమతులు పెంచడంతోపాటు, ప్రపంచ మార్కెట్లలో దేశీయ వస్తువుల పోటీ పడేలా చేయడానికి ఇవి సాయపడతాయి. కేంద్ర ప్రభుత్వం బుధవారం ఎక్స్​పోర్ట్​ ప్రమోషన్​ మిషన్​కు (ఈపీఎం) రూ. 25,060 కోట్లు, క్రెడిట్​ గ్యారెంటీ పథకానికి రూ. 20 వేలు కోట్లు కేటాయిస్తూ ఆమోదం తెలిపింది. 

 ఈపీఎం ఎగుమతుల్లో పోటీతత్వాన్ని మెరుగుపరుస్తుందని, ఎంఎస్​ఎంఈలు, తొలిసారి ఎగుమతి చేసేవారికి, లేబర్ ఎక్కువగా అవసరముండే రంగాలకు సహాయపడుతుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గురువారం అన్నారు. క్రెడిట్​ గ్యారెంటీ పథకంతో వ్యాపార కార్యకలాపాలు సులభంగా జరుగుతాయని పేర్కొన్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్​ షా మాట్లాడుతూ ఈ పథకాలతో భారతదేశ ఎగుమతి రంగానికి కొత్త సపోర్ట్ సిస్టమ్‌‌ లభించిందని అన్నారు.  క్రెడిట్​ గ్యారెంటీ పథకం (సీజీఎస్​ఈ) లిక్విడిటీని పెంచుతుందని, ఎంఎస్​ఎంఈలకు మేలు చేస్తుందని,  ట్రిలియన్​ డాలర్ల ఎగుమతుల లక్ష్యం దిశగా భారత్​ పయనాన్ని వేగవంతం చేస్తుందని పేర్కొన్నారు. ఫైనాన్స్,పాలనాపరమైన ఇబ్బందులు, బ్రాండింగ్​ లోపాలు వంటి సవాళ్లను ఎదుర్కోవడానికి ఈ రెండు పథకాలు సహాయపడతాయని ఎక్స్​పర్టులు తెలిపారు.  ఎంఎస్​ఎంఈలకు, తొలిసారి ఎగుమతి చేసేవారికి, శ్రమశక్తితో కూడిన రంగాలకు ఈ పథకాలు మేలు చేస్తాయన్నారు.