హైదరాబాద్, వెలుగు:ప్రైవేట్, కార్పొరేట్ స్కూల్స్ కు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం తరగతులు నడుస్తున్నాయి. జూన్ 12న స్కూల్స్ రీ ఓపెన్ కానున్నాయి. తమ పిల్లలను ఇంగ్లిష్ మీడియంలో చదివించేందుకు పేరెంట్స్ ఆసక్తి చూపడంతో ప్రైవేట్, కార్పొరేట్ స్కూల్స్ వీధివీధికి పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి. ప్రభుత్వ బడుల్లో ఇంగ్లిష్ మీడియాన్ని ప్రారంభించడంతో ఇప్పుడు ప్రభుత్వ విద్యకు క్రమేణా ఆదరణ పెరుగుతుంది. ఇంతకాలం ఇంగ్లిష్ మీడియం మోజులో పేరెంట్స్ ప్రైవేట్ స్కూల్స్ కు పంపించారు. ఇప్పుడు ప్రభుత్వ బడుల్లోనూ ఇంగ్లిష్ మీడియంలో బోధన మెరుగ్గా సాగుతుండటంతో ఇన్నాళ్లూ ప్రైవేట్ మోజులో జేబుకు చిల్లు పెట్టుకున్న పేరెంట్స్ కు ఈ పరిణామం ఉపశమనంగా చెప్పుకోవచ్చు. ప్రభుత్వ విద్యా ప్రమాణాలను పెంచేందుకు విద్యాశాఖాధికారులు, టీచర్లు చేస్తున్న కృషికి సత్ఫలితాలు వస్తున్నందునా మిడిల్క్లాస్ పీపుల్ ప్రభుత్వ స్కూల్స్ వైపు మరళుతున్నారు. ఫీజుల బాధ తప్పడంతో పాటు నాణ్యమైన చదువును ఉచితంగా అందుకునే వెసులుబాటు ఉండటంతో ప్రభుత్వ బడుల్లో ఇంగ్లిష్ మీడియంలో చేరే వారి సంఖ్య క్రమేణా పెరుగుతుంది.
రాజ్భవన్ స్కూల్కి ఫుల్ డిమాండ్
ఇంగ్లిష్ మీడియంతో పాటు తెలుగు మీడియం, ఉర్దూ మీడియం కూడా అందుబాటులో ఉన్నందునా ఎందులో కావాలంటే అందులో విద్యార్థులు తమ ఆసక్తుల మేరకు చేరే అవకాశం ఉంది. కొన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన మౌలిక వసతులు ఉన్నప్పటికీ ఇంగ్లిష్ మీడియంలో బోధించేందుకు సరిపడ సిబ్బంది లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వ పాఠశాలలకు గత వైభవాన్ని తెచ్చేందుకు ఒక పక్క అధికారులు మరో పక్క ఉపాధ్యాయ సంఘాలు విద్యావ్యవస్థలో సంస్కరణలు తెచ్చేందుకు తమ పరిధిల్లో కృషి చేస్తున్నారు. ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్లతో పోటీ పడేందుకు మెరుగైన వసతులతో పాటు ఇంగ్లిష్ మీడియంలో బోధించే టీచర్లను ప్రభుత్వం రిక్రూట్ చేయాలని విద్యావేత్తలు అభిప్రాయబడుతున్నారు. అప్పుడే ప్రభుత్వ పాఠశాలలకు పూర్వ వైభవం సాధ్యమవుతుందని వారు పేర్కొంటున్నారు.
ప్రభుత్వం కూడా విద్యా వ్యవస్థలో మార్పులకు తోడ్పాటు అందిస్తే విద్యలో మెరుగైన ఫలితాలు తెచ్చేందుకు అవకాశం ఉంటుదనే విషయాన్ని ప్రభుత్వం గుర్తెరగాలి. రాజ్భవన్ ప్రభుత్వ పాఠశాలలో సీట్లకు విపరీత పోటీ నెలకొంటుంది. కారణం అక్కడి వసతులు, నాణ్యమైన బోధన ప్రమాణాలు ప్రైవేట్ స్కూళ్లకు దీటుగా కొనసాగుతుంది. నగరంలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో ఇదే పరిస్థితి నెలకొంది. ప్రైవేట్ పాఠశాలల్లో ఏటా పెరుగుతున్న ఫీజులు ఇతరత్రా ఖర్చులు తల్లిదండ్రులను ఆలోచింపజేస్తుంది. పైగా ప్రభుత్వ బడులు ప్రైవేట్కు దీటుగా ఉత్తీర్ణత సాధిస్తుండటంతో ప్రభుత్వ బడుల్లో చేర్పించేందుకు వారు మొగ్గు చూపుతున్నారు. ప్రభుత్వ బడుల్లో మధ్యాహ్న భోజనంతో పాటు పుస్తకాలు, డ్రెస్ ఇతర సదుపాయాలు పేరెంట్స్ ను ఆకర్షిస్తున్నాయి.
2006లో ప్రారంభం
హైదరాబాద్ జిల్లాలో 2006లో ప్రభుత్వ బడుల్లో ఇంగ్లిష్ మీడియం ప్రారంభమైంది. ప్రయోగాత్మకంగా అప్పట్లో 104 సక్సెస్ స్కూళ్లల్లో ఇంగ్లిష్ మీడియాన్ని ప్రారంభించారు. అప్పటికే జిల్లాలో 15 పూర్తి స్థాయి ఇంగ్లిష్ మీడియం పాఠశాలలు నడిచేటివి. ఇవి విజయవంత అవ్వడంతో 2010లో జిల్లాకు 200 ఇంగ్లిష్ మీడియం స్కూళ్లు మంజూరయ్యాయి. విద్యార్థుల సంఖ్య పెరుగుతుండటంతో క్రమేణా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు మీడియంతోపాటు ఇంగ్లిష్ మీడియం స్కూళ్లను ప్రారంభించారు. ఇవి కాకుండా దాదాపు 30 వరకు పూర్తి స్థాయి ఇంగ్లిష్ మీడియం పాఠశాలలు నడుస్తున్నాయి.. ప్రభుత్వ పాఠశాలల మనుగడను, విద్యార్థుల భవిష్యత్ను దృష్టిలో పెట్టుకొని ఉపాధ్యాయులే స్వచ్ఛందంగా ఇంగ్లిష్ నేర్చుకొని మరీ ఇంగ్లిష్ మీడియం పాఠాలను సమర్థంగా బోధిస్తున్నారు.