దోషులైన నేతలపై జీవితకాల నిషేధం వద్దు..ఆరేండ్లు చాలు: కేంద్రం

దోషులైన నేతలపై జీవితకాల నిషేధం వద్దు..ఆరేండ్లు చాలు: కేంద్రం
  • కేసుల్లో దోషులుగా తేలిన నేతలపై చర్యల విషయంలో కేంద్రం
  • ఇప్పుడున్న ఆరేండ్ల అనర్హత వేటుచాలంటూ సుప్రీంలో అఫిడవిట్

న్యూఢిల్లీ: వివిధ కేసుల్లో దోషులుగా తేలిన రాజకీయ నాయకులకు ఎన్నికల్లో పాల్గొనకుండా జీవితకాల నిషేధం విధించడం సరికాదని సుప్రీంకోర్టుకు కేంద్రం తెలిపింది. ఇది చాలా కఠినమైనదని, ప్రస్తుతం ఉన్న ఆరేండ్ల అనర్హత సరిపోతుందని పేర్కొన్నది. ఈ మేరకు సుప్రీంకోర్టులో బుధవారం అఫిడవిట్​ దాఖలు చేసింది.  

దోషులుగా తేలిన పొలిటికల్​ లీడర్స్​పై జీవితకాల నిషేధం విధించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ప్రస్తుతం ఉన్న ఆరేండ్ల నిషేధం సరిపోదని, వీరు ఎన్నికల్లో శాశ్వతంగా పోటీ చేయకుండా  నిషేధం విధించాలని కోరుతూ అశ్విని ఉపాధ్యాయ్ అనే న్యాయవాది పిటిషన్ వేశారు.  దీనిపై ఫిబ్రవరి 10న కోర్టు విచారణ చేపట్టింది.  

సెక్షన్‌ 8, సెక్షన్‌ 9 రాజ్యాంగ చెల్లుబాటుపై స్పందన తెలియజేయాలని కేంద్రంతోపాటు ఎన్నికల సంఘాన్ని  కోరింది. ఈ క్రమంలోనే  సుప్రీంకోర్టులో కేంద్రం తాజాగా అఫిడవిట్‌ దాఖలు చేసింది. దోషులుగా తేలిన నేతలపై జీవితకాల నిషేధాన్ని వ్యతిరేకించింది. 

పార్లమెంట్​ పరిధిలోనిదే..

క్రిమినల్ కేసుల్లో దోషులుగా తేలిన రాజకీయ నాయకులపై జీవితకాలం నిషేధం విధించాలా? ఆరేండ్ల నిషేధం విధించాలా? అనేది పార్లమెంట్​ పరిధిలోని అంశమని కేంద్రం తన అఫిడవిట్‌లో పేర్కొన్నది.  

పిటిషనర్‌ లేవనెత్తిన అంశాలు కూడా విస్తృత శ్రేణి కలిగి ఉన్నాయని, అవన్నీ పార్లమెంటు శాసన విధానాల పరిధిలోకే వస్తాయని తెలిపింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 102,191పై పిటిషనర్ ఆధారపడడం పూర్తిగా తప్పు అని అఫిడవిట్​లో పేర్కొన్నది.

పార్లమెంట్​ ఇప్పటికే అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకొనే దోషులుగా తేలిన పొలిటికల్​ లీడర్స్​పై ఆరేండ్ల నిషేధం విధించిందని కోర్టుకు తెలిపింది. కాగా, దీనిపై సుప్రీంకోర్టు తుది తీర్పును వెలువరించాల్సి ఉన్నది.