ఇస్రో చీఫ్ కె.శివన్
న్యూఢిల్లీ: స్పేస్ సెక్టార్ను ప్రైవేటు ఎంటర్ప్రైజెస్ల కోసం తెరిచి ఉంచాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు ఇస్రో చీఫ్ కె.శివన్ తెలిపారు. దీని వల్ల ఇండియాను అంతరిక్ష రంగంలో సరికొత్త దిశగా తీసుకెళ్లొచ్చని హర్షం వ్యక్తం చేశారు. ఎండ్ టూ ఎండ్ స్పేస్ సర్వీసుల కోసం సెక్టార్ స్పేస్ యాక్టివిటీస్ను స్పేస్ డిపార్ట్మెంట్ ప్రమోట్ చేస్తుందన్నారు. దీంట్లో రాకెట్స్ను రూపొందించడం, లాంచ్ చేయడం కూడా కలిసే ఉంటాయని చెప్పారు. స్పేస్ సెక్టార్లో ఉన్న కొన్ని దేశాల సరసన అడ్వాన్స్డ్ స్పేస్ టెక్నాలజీతో ఉన్న ఇండియా తన ఇండస్ట్రియల్ బేస్ను పెంచుకునే అవకాశం ఉందన్నారు. సంస్కరణ చర్యలను అమలు చేయడంతోపాటు ఇస్రో ఘనతను ముందుకు తీసుకెళ్లడంలో భాగంగా స్పేస్ సెక్టార్ను ప్రైవేటు ఎంటర్ప్రైజెస్ కోసం తెరిచామని పేర్కొన్నారు. సామాజిక ఆర్థిక సంస్కరణల్లో భాగంగా స్పేస్ బేస్డ్ రీఫార్మ్స్ ఇండియా అభివృద్ధిలో చాలా దోహదపడతాయని వివరించారు.