కర్నాటకలో అధికారంలో ఉన్న కాంగ్రెస్, జేడీ (ఎస్ ) కూటమి మధ్య దూరం పెరుగుతోందంటూ వార్తలు వస్తున్న వేళ.. మాజీ ప్రధాని, జేడీ (ఎస్ ) చీఫ్ హెచ్.డి.దేవెగౌడ్ బాంబు పేల్చారు. రాష్ట్ర అసెంబ్లీకి మధ్యంతర ఎన్నికలు తప్పవని కామెంట్స్ చేయడంతో ఒక్కసారిగా రాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి. కుమారస్వామి నాయకత్వంలోని కాంగ్రెస్- జేడీ (ఎస్ ) కూటమి ప్రభుత్వం ఎంతకాలం అధికారంలో కొనసాగుతుందో తనకు తెలియదని దేవెగౌడ్ శుక్రవారం మీడియాకు చెప్పారు. జేడీ(ఎస్)తో పొత్తుపెట్టుకోవడంవల్ల పార్టీ బాగా నష్టపోయిందని, లోక్సభ ఎన్నికల్లో ఇది తెల్సిపోయిందని మాజీ సీఎం, కాంగ్రెస్ లెజస్లేచర్పార్టీ చీఫ్ సిద్ధరామయ్య పార్టీ చీఫ్ రాహుల్గాంధీకి ఉప్పందించారంటూ వార్తలు వచ్చిన నేపథ్యంలో దేవెగౌడ్ ఈ కామెంట్స్ చేశారు. పరిస్థితి సీరియస్గా మారే అవకాశముందని గ్రహించిన ముఖ్యమంత్రి కుమారస్వామి, కాంగ్రెస్ స్టేట్ చీఫ్ దినేశ్ గుండూరావు ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవడంతో దేవెగౌడ్ యూటర్న్ తీసుకున్నారు.
కుమారస్వామి జోక్యం…
కాంగ్రెస్, జేడీఎస్ కూటమి ప్రభుత్వంపై దేవెగౌడ్ వివాదాస్పద కామెంట్స్ చేయడంతో .. కుమారస్వామి జోక్యం చేసుకున్నారు. డామేజ్ కంట్రోల్కు ప్రయత్నించారు. సంకీర్ణ ప్రభుత్వానికి ఎలాంటి ఢోకా లేదని క్లారిటీ ఇచ్చారు. తన తండ్రి తాజా పరిస్థితుల్ని అపార్థంచేసుకున్నారని చెప్పారు. ‘‘అర్బన్ లోక్బాడీ ఎలక్షన్లకు ప్రిపేర్గా ఉండాలని మాత్రమే ఆయన (దేవెగౌడ) చెప్పారు. అసెంబ్లీ ఎలక్షన్లు వస్తాయని ఆయన అన్లేదు. దీనిపై ఆయన క్లారిఫికేషన్ కూడా ఇచ్చారు. మిడ్ టర్మ్ పోల్స్ వచ్చే చాన్స్ లేదు. వచ్చే నాలుగేళ్లూ మా ప్రభుత్వమే కొనసాగుతుంది’’ అని కుమారస్వామి వివరణ ఇచ్చారు. దేవెగౌడ కామెంట్స్పై కాంగ్రెస్ స్టేట్ చీఫ్ దినేశ్ గుండూరావు స్పందించారు. జేడీఎస్, కాంగ్రెస్ కూటమి ప్రభుత్వం పటిష్ఠంగానే ఉందని, మధ్యంతర ఎన్నికలు వచ్చే ప్రశ్నేలేదని స్పష్టంచేశారు. జేడీఎస్కు తాము బేషరతుగా మద్దతు ఇస్తున్నామని ఆయన చెప్పారు. కాంగ్రెస్ స్పందించడంతో దేవెగౌడ్ కూడా తాను చేసిన కామెంట్స్పై వివరణ ఇచ్చారు. మధ్యంతర ఎన్నికలు తన చేతిలో లేదన్నారు. ‘‘ కాంగ్రెస్ బలంగా ఉన్నంతవరకు, తాము కూడా స్ట్రాంగ్గానే ఉంటాం’’ అని దేవెగౌడ్ చెప్పారు. జేడీఎస్ చీఫ్ క్లారిఫికేషన్తో కాంగ్రెస్తో ఆపార్టీకి ఉన్న పొత్తుపై కొనసాగుతున్న సస్పెన్స్కు తెరపడినట్టయింది.
యడ్యూరప్ప ఏమన్నారంటే?…
దేవెగౌడ్ కామెంట్స్ పై బీజేపీ స్టేట్ చీఫ్ బి.ఎస్. యడ్యూరప్ప రియాక్ట్ అయ్యారు. మధ్యంతర ఎన్నికలు అవసరంలేదన్నారు. ప్రజలు కూడా దీనికి ఇష్టపడరని చెప్పారు.