బస్​ డిపో కోసం మా భూమిని గుంజుకున్నరు

బస్​ డిపో కోసం మా భూమిని గుంజుకున్నరు

అన్యాయం చేస్తున్నాడని బాధితుల ఆవేదన 
పీఎస్​లో పెట్టి నిర్బంధించారని ఆరోపణ
న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరిక 

చెన్నూర్​, వెలుగు : మంచిర్యాల జిల్లా చెన్నూర్​ఎమ్మెల్యే బాల్క సుమన్​బస్​డిపో ఏర్పాటు కోసం తమ భూమిని గుంజుకోవడమే కాకుండా తమను పోలీస్​స్టేషన్​లో నిర్బంధం చేయించాడని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. చెన్నూర్​కు చెందిన బాధితులు బోగె లక్ష్మి, పెద్ద రాజేశ్వరి, చిన్న రాజేశ్వరి కథనం ప్రకారం... పట్టణంలోని గెర్రె కాలనీ శివారు  869/28/1లో  తమ మామ అయిన బోగె మల్లయ్య పేరిట మూడెకరాల భూమి ఉందన్నారు. 50 ఏండ్లుగా ఈ భూమిని సాగు చేసుకుంటున్నామన్నారు. 


మల్లయ్య చనిపోయిన తర్వాత ఆయన ముగ్గురు కొడుకులు కూడా మరణించడంతో వారి భార్యలమైన తాము సాగు చేసుకుంటున్నామన్నారు. ఈ భూమిలో చెన్నూర్​ తహసీల్దార్ శ్రీనివాస్​దేశ్​పాండే ఇన్​చార్జి మున్సిపల్ కమిషనర్ గా ఉన్నప్పుడు గతేడాది అక్టోబర్​9న ఇంటి నెంబర్ కూడా ఇచ్చాడన్నారు. ఈ ఏడాది ఏప్రిల్ 24న తమ భూమిలో బస్​డిపో ఏర్పాటు కోసం పరిశీలించారని, పెన్సింగ్​పోల్స్​తొలగిస్తే అడ్డుకున్నామన్నారు. అప్పుడు ఇది ప్రభుత్వ భూమి అని, తమ భూమి వెనుకాల ఉందని చెప్పారన్నారు. ఈ భూమి బస్​డిపోకు అప్పగిస్తే తమ భూమి చూపిస్తానని నమ్మబలికారన్నారు. తమకు ఆ రోజు వెనకాల ఉందని చెప్పిన భూమి ఇప్పుడు వేరేవాళ్లపై పేరిట ఉందన్నారు. తాము అక్కడికి వెళ్తే ఆ భూమి యజమానులు కేసులు పెడతామని బెదిరిస్తున్నారన్నారు. 

ఇప్పటివరకు తమకు భూమి చూపలేదని, తాము సాగు చేసుకుంటున్న భూమిలో ఆదివారం బస్​ డిపో ఏర్పాటుకు ఎమ్మెల్యే బాల్క సుమన్​భూమిపూజ చేశారన్నారు. తమ భూమిని దౌర్జనంగా ఎందుకు గుంజుకుంటున్నారని అడిగినందుకు పోలీసులతో అరెస్టు చేయించి స్టేషన్​లో నిర్బంధించి భూమిపూజ పూర్తయిన తర్వాత విడిచిపెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే బాల్క సుమన్​, తహసీల్దార్​ శ్రీనివాస్​దేశ్​పాండే కలిసి తమను మోసం చేశారన్నారు. తమ మామ మల్లయ్య పేరిట ఉన్న మూడెకరాల భూమిని తమకు అప్పగించాలని, లేకుంటే ఆత్మహత్య చేసుకుంటామని వాపోయారు.