అధికారిక కార్యక్రమాల్లో కొడుకులు, తమ్ముళ్ల పెత్తనం

అధికారిక కార్యక్రమాల్లో కొడుకులు, తమ్ముళ్ల పెత్తనం

నిజామాబాద్,  వెలుగు:  ఉమ్మడి జిల్లాలో పలువురు ఎమ్మెల్యేల కుటుంబ సభ్యులు షాడో ఎమ్మెల్యేలుగా వ్యవహరిస్తున్నారన్న  విమర్శలు వస్తున్నాయి. ఇద్దరు ఎమ్మెల్యేల కుమారులు, ముగ్గురు ఎమ్మెల్యేల బ్రదర్స్​ అధికారిక కార్యక్రమాలకు చీఫ్​ గెస్టులుగా హాజరవుతుండడంతో వివాదాలు తలెత్తుతున్నాయి.  నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాల్లో ఎమ్మెల్యేల స్థానంలో హాజరై  ప్రారంభాలు, పంపిణీలు చేస్తుండడంతో  బీఆర్ఎస్​సీనియర్లు, సెకండ్​ క్యాడర్​లీడర్లు గుర్రుగా ఉన్నారు.

ఈ వ్యవహారంపై ఇప్పటికే  సీనియర్లు, తెలంగాణ ఉద్యమ కారులు పార్టీ హైకమాండ్​కు కంప్లైంట్​కూడా చేశారు. ప్రజల్లో వ్యతిరేకత వస్తుందని హైకమాండ్​హెచ్చరించినా మార్పు రావడం లేదని పలువురు లీడర్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యేలకు షాడోలుగా వ్యవహరిస్తూ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని  ప్రతి పక్ష పార్టీల లీడర్లు కూడా ఆరోపిస్తున్నారు. 

ఎన్నికల్లో బరిలో నిలిచేందుకు ముందస్తు ప్లాన్​..

ఉమ్మడి జిల్లాలో తొమ్మిది  నియోజకవర్గాల్లో బీఆర్ఎస్​ఎమ్మెల్యేలు ప్రాతినిథ్యం వహిస్తున్నారు.  బాన్సువాడ, నిజామాబాద్​రూరల్​ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాస్​రెడ్డి, బాజిరెడ్డి గోవర్ధన్​ కుమారులు తండ్రుల స్థానంలో హాజరవుతూ నియోజకవర్గాల్లో హల్​చల్​చేస్తున్నారు. ధర్పల్లి  జడ్పీటీసీగా ఉన్న నిజామాబాద్​రూరల్​ఎమ్మెల్యే కుమారుడు బాజిరెడ్డి జగన్​ మండల అభివృద్ధి పనులకే పరిమితం కావాల్సి ఉండగా,  నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో నిర్వహించే అధికారిక కార్యక్రమాలకు హాజరవుతున్నారు.  

కల్యాణలక్ష్మి,  షాదీ ముబారక్​, సీఎంఆర్ఎఫ్​చెక్కులను ఎమ్మెల్యే గోవర్ధన్​లేకున్నా ఆయన పంపిణీ చేస్తున్నారు.   ఈ వ్యవహారంపై బీఆర్ఎస్​సీనియర్లు, సెకండ్​క్యాడర్​లీడర్లు  బహిరంగంగా వ్యతిరేకించకున్నా.. అంతర్గతంగా చర్చించుకుంటున్నారు.  బాన్స్​వాడ స్పీకర్​పోచారం శ్రీనివాస్​ రెడ్డి తనయుడు సురేందర్​ రెడ్డి నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాలకు హాజరవుతున్నారు.  ఎలాంటి హోదా లేకున్నా.. ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొంటుండడంతో నియోజకవర్గంలో నిరసనలు వ్యక్తమవుతున్నాయి. సురేందర్​రెడ్డి సోదరుడు  భాస్కర్​ రెడ్డి వర్గీయులే ఆయన తీరును వ్యతిరేకిస్తున్నారు.  ఇటీవల కోటగిరి మండలంలో వడ్ల కొనుగోలు  కేంద్రాలను పోచారం సురేందర్​ రెడ్డి హాజరై ప్రారంభించారు.

 ఎమ్మెల్యే స్థానంలో ఎలా ప్రారంభిస్తారని ప్రతిపక్ష పార్టీల లీడర్లు నిలదీశారు.  బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్​ రెడ్డి  సోదరుడు అజయ్​రెడ్డి,   బోధన్​ ఎమ్మెల్యే షకీల్​భార్య, తమ్ముడు సొహెల్​, ఆర్మూర్​ ఎమ్మెల్యే జీవన్​రెడ్డి తమ్ముడు రాజేశ్వర్​ రెడ్డి, అర్బన్​ ఎమ్మెల్యే సోదరుడు రాకేశ్​షాడో ఎమ్మెల్యేలుగా వ్యవహరిస్తున్నారని ప్రతిపక్షాలు కొంత కాలంగా ఆరోపిస్తున్నారు. పార్టీ కార్యక్రమాలతో పాటు  పోస్టింగులు, కాంట్రాక్ట్​ పనులు, సెటిల్మెంట్లు చేస్తున్నట్లు కూడా ఆరోపణలు వస్తున్నాయి.   

పోటా పోటీగా వారసుల ప్రయత్నం..

స్పీకర్​పోచారం శ్రీనివాస్​రెడ్డి, బాజిరెడ్డి గోవర్ధన్​ వయస్సు రీత్యా వారి  కుమారులు తండ్రుల స్థానాలను నిలబెట్టుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. పోచారం కుమారులు  సురేందర్ రెడ్డి, భాస్కర్​రెడ్డి ఇద్దరూ తండ్రి సీటు దక్కించుకునేందుకు పోటాపోటీగా ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే భాస్కర్​రెడ్డి  డీసీసీబీ చైర్మన్​గా ఉండడంతో డీసీసీబీ లోన్ల పంపిణీతో పాటు అభివృద్ధి కార్యక్రమాల్లో అన్నీ తానై వ్యవహరిస్తున్నారు.

సురేందర్​రెడ్డి పార్టీ క్యాడర్​, తండ్రి వెన్నంటే ఉంటూ నియోజకవర్గంలో జోరుగా పర్యటిస్తున్నారు.  బాజిరెడ్డి గోవర్ధన్​కొడుకు జగన్​కూడా జడ్పీటీసీగా ఉంటూ మండలానికే పరిమితం కాకుండా నియోజకవర్గం అంతా కలియతిరుగుతూ క్యాడర్​కు వచ్చే ఎన్నికల్లో తానే పోటీ చేస్తాననే సంకేతాలిస్తున్నారు.