మంచిర్యాల,వెలుగు: మంచిర్యాల జిల్లా కాంగ్రెస్లో గ్రూపు రాజకీయాలు తారస్థాయికి చేరాయి. జిల్లాలోని సీనియర్ లీడర్లు టీపీసీసీ చీఫ్ రేవంత్ అనుకూల, వ్యతిరేక వర్గాలుగా విడిపోయి ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటూ కయ్యానికి కాలు దువ్వుతున్నారు. విమర్శలు, ప్రతివిమర్శలు చేసుకుంటూ పార్టీ పరువును బజారుకీడుస్తున్నారు. ఈ రెండు వర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది. దీనంతటికి మాజీ ఎమ్మెల్సీ కె.ప్రేమ్సాగర్రావు ఒంటెత్తు పోకడలే కారణమని ఆరోపిస్తున్నారు. పదేండ్ల కిందట ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చక్రం తిప్పిన ఆయన నేటికీ 'ఏక్ నిరంజన్'గా వ్యవహరించడాన్ని మిగతా నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. వారంతా పీఎస్సార్కు వ్యతిరేకంగా ఒక్కటవుతున్నారు. అసలే ఇది ఎలక్షన్ సీజన్. నేతలంతా విభేదాలు మర్చిపోయి ఏకతాటిపై ముందుకు సాగాల్సిన సమయం. అందరూ కలిసి పార్టీని బలోపేతం చేయాల్సింది పోయి గ్రూపు రాజకీయాలతో మరింత దిగజార్చుతున్నారని ఆ పార్టీ కేడర్ వాపోతున్నారు. ఓవైపు కాంగ్రెస్ బలోపేతం కోసం టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి రాష్ర్టంలో హాత్ సే హాత్ జోడో యాత్ర చేస్తుంటే... మరోవైపు జిల్లా నాయకులు ఎవరికి వారే అన్న తీరుగా రచ్చ చేయడం కార్యకర్తలకు, అభిమానులకు ఏమాత్రం మింగుడుపడడం లేదు.
కోవర్ట్ పాలి'ట్రిక్స్' రచ్చ....
జిల్లా కాంగ్రెస్లో కోవర్ట్ పాలి'ట్రిక్స్' రచ్చ ఆ పార్టీ కేడర్ను గందరగోళానికి గురిచేస్తోంది. రేవంత్తో పీఎస్సార్కు పొసగకపోవడంతో కొంతకాలంగా పార్టీ మారాలని యోచిస్తున్నారు. ప్రజల కోసం అవసరమైతే పార్టీ మారడానికి సిద్ధమేనని ఆయన గతంలో ప్రకటించారు. అంతేగాకుండా ఉమ్మడి జిల్లాలోని తన ఫాలోవర్స్తో వేంపల్లిలో మీటింగ్ పెట్టి రేవంత్కు ఐదు డిమాండ్లతో అల్టిమేటం జారీచేశారు. ఉత్తర తెలంగాణలో కొత్త పార్టీ పెడుతానని హెచ్చరించారు. దీంతో పీఎస్సార్ తీరుపై ఆయన వ్యతిరేక వర్గం నేతలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ లీడర్లతో టచ్లో ఉంటూ కోవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నాడని విమర్శిస్తున్నారు. మంచిర్యాలలో తన సీటును కాపాడుకొంటూ మిగతా రెండు సెగ్మెంట్లలో కాంగ్రెస్ను దెబ్బతీసేందుకు వందల కోట్ల విలువైన భారీ డీల్ జరిగిందని బహిరంగంగానే ఆరోపిస్తున్నారు. ఈ కారణంగానే సీనియర్లతో కయ్యానికి కాలు దువ్వుతున్నాడని, పార్టీలోకి వలసలు రాకుండా అడ్డుకుంటున్నారని ఆరోపిస్తున్నారు.
ఆరోపణలకు బలం చేకూర్చేలా....
పీఎస్సార్ ధోరణి సైతం అందుకు బలం చేకూర్చేవిధంగా ఉండడం గమనార్హం. గతంలో జరిగిన మండల పరిషత్, మున్సిపల్ ఎలక్షన్లలో, లోకల్ బాడీస్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీకి అనుకూలంగా ప్యాకేజీలు చేతులు మారాయన్న ఆరోపణలు వినిపించాయి. బెల్లంపల్లి, చెన్నూర్ ఎస్సీ, బోథ్, ఆసిఫాబాద్ ఎస్టీ రిజర్వుడ్ సెగ్మెంట్లలో బలమైన లీడర్లు ఉన్నప్పటికీ అక్కడ తన అనుచరులే బరిలో ఉంటారని ప్రకటించడాన్ని తప్పుపడుతున్నారు. గతంలో కాంగ్రెస్ నుంచి గెలిచి మంత్రి పదవి చేపట్టిన వినోద్ కిందటి ఎలక్షన్లలో ఏనుగు గుర్తుపై పోటీ చేసి స్వల్ప ఓట్లతో ఓడిపోయారు. ఆయన తిరిగి సొంత గూటికి చేరి మరోసారి బెల్లంపల్లి నుంచి పోటీకి రెడీ అవుతున్నారు. కానీ పీఎస్సార్ తన అనుచరుడైన చిలుముల శంకర్ బరిలో ఉంటారని ప్రకటించారు. చెన్నూర్ మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు సిట్టింగ్ ఎమ్మెల్యే బాల్క సుమన్తో పొసగక కాంగ్రెస్లో చేరారు. నల్లాల దంపతులను రేవంతే స్వయంగా ఢిల్లీ తీసుకెళ్లి ప్రియాంకగాంధీ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పించారు. దీంతో చెన్నూర్ కేడర్లో ఒక్కసారిగా జోష్ కనిపించింది. కానీ... పీఎస్సార్ ఆయనను పొమ్మనలేక పొగపెట్టి నాలుగు నెలల్లోనే సొంత గూటికి తరిమేశారన్న అపవాదు ఉంది. సుమన్ అనుచరుడైన ఓ యువనేతను కాంగ్రెస్లో చేర్చుకొని పెద్ద పీట వేయడంపైనా అభ్యంతరాలు ఉన్నాయి. అలాగే చెన్నూర్లో నూకల రమేష్, ఆసిఫాబాద్లో డాక్టర్ గణేష్ రాథోడ్, బోథ్లో డాక్టర్ వెన్నెల అశోక్లకే టికెట్లు అని పీఎస్సార్ ప్రకటించడాన్ని అక్కడి ఆశావహులు జీర్ణించుకోలేకపోతున్నారు. వీళ్లలో ఒక్కరికీ బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలను ఢీకొనే సత్తా లేదని, కోవర్ట్ పాలి'ట్రిక్స్'లో 'డమ్మీ క్యాండిడేట్లు' అని రేవంత్ వర్గం నేతలు వాదిస్తున్నారు. కాంగ్రెస్లో క్యాండిడేట్లను ఏఐసీసీ డిసైడ్ చేస్తుందని, ఎవరికి వారు ఇచ్చుకోవడానికి ఇవేమైనా సినిమా టికెట్లా? అని ఫైర్ అవుతున్నారు.
వ్యతిరేక గ్రూపులుగా....
పీసీసీ చీఫ్ రేవంత్ అనుకూల, వ్యతిరేక వర్గాలు ఉన్నట్లుగానే జిల్లా స్థాయిలో కూడా రెండు గ్రూపులు ఏర్పడ్డాయి. భట్టి విక్రమార్క, దుద్దిళ్ల శ్రీధర్బాబు గ్రూపులో ప్రేమ్సాగర్రావు కొనసాగుతున్నారు. మాజీ మంత్రి గడ్డం వినోద్, పీసీసీ జనరల్ సెక్రటరీ గోమాస శ్రీనివాస్, సీనియర్ లీడర్లు కేవీ.ప్రతాప్, వంగల దయానంద్,ఐఎన్టీయూసీ ప్రెసిడెంట్ జనక్ప్రసాద్, లక్సెట్టిపేట జడ్పీటీసీ మెంబర్ ముత్తె సత్తయ్య, బెల్లంపల్లి మాజీ జడ్పీటీసీ కారుకూరి రాంచందర్ తదితరులు రేవంత్ వర్గంలో ఉన్నారు. ఆ మధ్య పీఎస్సార్, వినోద్ కలిసినట్టే కనిపించినా వారిద్దరి మధ్య మళ్లీ దూరం పెరిగింది. బెల్లంపల్లిలో వినోద్కు వ్యతిరేకంగా పీఎస్సార్ కుంపటి రగిలిస్తున్నారు. పెద్దపల్లి ఎంపీ సీటును ఆశిస్తున్న గోమాస శ్రీనివాస్కు, పీఎస్సార్కు మధ్య ఉప్పూ నిప్పు అన్నట్టుంది పరిస్థితి. ఇక కేవీ.ప్రతాప్ డీసీసీ పగ్గాల కోసం ఎదురుచూస్తున్నారు. చాన్స్ వస్తే మంచిర్యాల నుంచి బరిలోకి దిగేందుకు రెడీ అవుతున్నారు. వీళ్లంతా తరచూ రేవంత్ను కలుస్తూ తాజా పరిణామాలను ఎప్పటికప్పుడు ఆయన చెవిలో వేస్తున్నారని సమాచారం. రేవంత్ ఆశీస్సులతోనే పీఎస్సార్తో ఢీకొంటున్నారని సొంత పార్టీలో ప్రచారం జరుగుతుండడం గమనార్హం.
విమర్శలు, భౌతిక దాడులు....
కాంగ్రెస్లో పీఎస్సార్ గ్రూప్ వర్సెస్ రేవంత్ గ్రూప్ అన్నట్టుగా పరిస్థితి మారింది. మొదటినుంచి కాంగ్రెస్ జెండా మోస్తున్నానని, కష్టకాలంలో పార్టీని కాపాడుకున్నానని, వీళ్లంతా ఇంతకాలం ఎక్కడపోయారని పీఎస్సార్ ప్రశ్నిస్తున్నారు. వాళ్లే కోవర్టు రాజకీయాలు చేస్తున్నారని ఆరోపిస్తుండగా, కాదు ఆయనే కోవర్టని ఇతర నేతలు అంటున్నారు. ప్రేమ్సాగర్రావు తన భార్య సురేఖను రెండోసారి డీసీసీ చైర్మన్ను చేసి ఆ పోస్టును అడ్డం పెట్టుకొని అందరిపైనా అజమాయిషీ చేస్తున్నాడని చెప్తున్నారు. డీసీసీకి సమాచారం లేదనే సాకుతో అనుచరులను తమపైకి ఉసిగొల్పి దాడులు చేయిస్తున్నాడని ఆరోపిస్తున్నారు. రైతు చైతన్య యాత్ర సందర్భంగా కలెక్టరేట్ వద్ద రాజ్యసభ మాజీ ఎంపీ వీహెచ్పై దాడి, ఇటీవల శ్రీరాంపూర్లో గోమాస శ్రీనివాస్ ర్యాలీపై దాడి, మొన్న బెల్లంపల్లిలో కేవీ.ప్రతాప్పై దాడి వంటి ఘటనలను ప్రస్తావిస్తున్నారు. రెండు వర్గాల నాయకులు ప్రెస్మీట్లు పెట్టి ఒకరినొకరు తిడుతున్నారు. ఈ పరిస్థితి ఇంకెంత దూరం వెళ్తుందోనని కేడర్లో ఆందోళన నెలకొంది.