- రాష్ట్రాలకు పరిహారం కొనసాగించడం పై కూడా..
న్యూఢిల్లీ: ఆన్లైన్ గేమింగ్, కాసినోలపై పన్ను విధింపు, రాష్ట్రాలకు కాంపెన్సేషన్ కొనసాగింపు వంటి అంశాలపై జీఎస్టీ కౌన్సిల్ బుధవారం నిర్ణయం తీసుకోనుంది. కాసినోలు, రేస్కోర్సులు, ఆన్లైన్ గేమింగ్పై 28 శాతం జీఎస్టీ వసూలు చేయాలనే నిర్ణయానికి కౌన్సిల్ వచ్చినట్లు తెలుస్తోంది. కొన్ని వస్తువులు, సేవలపై పన్ను రేట్లలో మార్పులను సిఫారసు చేస్తూ మినిస్టర్ల గ్రూపు ఇచ్చిన రిపోర్టును మంగళవారం నాటి సమావేశంలో కౌన్సిల్ ఆమోదించింది.
జీఎస్టీ సిస్టమ్లో కొన్ని మార్పులను సూచించిన మరో మినిస్టర్ల కమిటీ రిపోర్టునూ కౌన్సిల్ అంగీకరించింది. బుధవారం నాటి మీటింగ్ తర్వాత జీఎస్టీ కౌన్సిల్ ఛైర్మన్, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మీడియాతో మాట్లాడతారు. జీఎస్టీని అమలులోకి తెచ్చినప్పుడు రాష్ట్రాలకు ఏర్పడే పన్ను నష్టాన్ని భర్తీ చేయడానికి పరిహారాన్ని అయిదేళ్లపాటు చెల్లించాలని నిర్ణయించారు. ఈ అయిదేళ్లు జూన్ 30 తో ముగియనుంది. దీంతో పరిహార చెల్లింపులను మరి కొంత కాలం కొనసాగించాలని కొన్ని రాష్ట్రాలు పట్టుపడుతున్నాయి. కొన్ని రాష్ట్రాలైతే ఈ మేరకు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి రిక్వెస్టులు కూడా పంపించాయి.