వెలుగు బిజినెస్ డెస్క్ : రైతులకు ఇండియాలో ఎప్పుడూ అన్యాయమే జరుగుతోంది. సరైన విధానాలు లేకపోవడం, ఉన్న విధానాలు సమర్ధంగా అమలు చేయకపోవడంతో రైతులు నష్టపోతూనే ఉన్నారు. ఎన్నో పంచ వర్ష ప్రణాళికలు ముగిసిపోయాయి. పాత ప్రభుత్వాలు పోయి, కొత్త ప్రభుత్వాలు వస్తూనే ఉన్నాయి. ఐనా, రైతుల జీవితాలలో చెప్పుకోదగ్గ మార్పులు ఏమీ రాలేదు. కొత్తగా అమలులోకి తెచ్చిన జీఎస్టీ కిందా రైతులకు పెద్దగా ప్రయోజనం లేకుండా పోయింది. దేశంలోని వ్యాపారాల తీరు, తెన్నులను మార్చేసేదిగా భావిస్తున్న ఈ జీఎస్టీ విధానం కూడా రైతులకు ఏమాత్రం న్యాయం చేయలేకపోతోంది. ఇండియాలో ఉద్యోగావకాశాలలో సగం వ్యవసాయమే కల్పిస్తోంది. జీఎస్టీ అమలుకు ముందు రైతులు ఎలా ఉన్నారో, ఇప్పుడూ అలాగే ఉన్నారు. ఇన్పుట్ ట్యాక్స్ క్లెయిమ్ చేసుకోలేని వ్యాపారస్తులు ఎవరైనా ఉంటే అది రైతులొక్కరే. ఇన్పుట్స్ మీద చెల్లించిన పన్నును తాను అవుట్పుట్పై చెల్లించాల్సిన పన్నుకు అడ్జస్ట్ చేసుకోవడానికి అనుమతించడాన్నే ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అంటారు.
ఇన్పుట్ ట్యాక్స్ విధానం రైతులను ఎలా పట్టించుకోవడం లేదో ఇప్పుడు తెలుసుకుందాం..సాగు కాలం మొదలవగానే రైతులు షాపులకెళ్లి ఎరువులు, పురుగు మందులు వంటి వాటిని రిటైల్గా కొంటారు. వాటిని ఉపయోగించి పంట పండిస్తారు. అదృష్టం బాగుంటే పంట బాగుండి, కొంత డబ్బు చేతికొస్తుంది. ఇలా రైతులు రిటైల్ షాపులలో కొనే ఎరువులు, పురుగు మందులపై రైతులు జీఎస్టీ చెల్లించాల్సిందే. పురుగు మందులపై అత్యధికంగా 18 శాతం జీఎస్టీని రైతులు చెల్లిస్తున్నారు. ఒక తయారీదారు లేదా ఒక వ్యాపారస్తుడిలాగే రైతు కూడా జీఎస్టీ చెల్లించి ముడిసరుకులను కొని, పంట పండిస్తున్నాడు. ఇక్కడిదాకా బానే ఉంది. ఇక్కడే తిరకాసంతా. తయారీదారు ముడిసరుకుల మీద చెల్లించిన జీఎస్టీని తాను అవుట్పుట్పై చెల్లించాల్సిన జీఎస్టీకి అడ్జస్ట్ చేసుకుంటాడు. అదే రైతు విషయానికి వస్తే, అతనికి ఆ అవకాశం లేకుండా పోయింది.
అవగాహన లోపమే కారణం
మరి కొంత మంది రైతుల అవగాహన లోపమే దీనికి కారణంగా తేల్చేస్తున్నారు. 99 శాతం మంది రైతులకు, జీఎస్టీ, ఎగుమతులు, దిగుమతుల వంటి ప్రభుత్వ విధానాలపై అసలు అవగాహనే ఉండదని కన్సార్టియమ్ ఆఫ్ ఇండియన్ ఫార్మర్స్ అసోసియేషన్స్ (సీఐఎఫ్ఏ) చీఫ్ ఎడ్వైజర్ పీ చెంగల్ రెడ్డి చెప్పారు. పంటలకు సంబంధించిన సమాచారం బాగా తెలుసున్న నాయకులు సీఐఎఫ్ఏలో చాలా మందే ఉన్నారు. కానీ, సమగ్రంగా తెలుసున్న వారు చాలా తక్కువమందని ఆయన పేర్కొన్నారు. రైతులలో అవగాహన పెంచడం కొంచెం కష్టమే కావచ్చునని, అయితే అసాధ్యం మాత్రం కాదని చెంగల్ రెడ్డి చెప్పారు. ఈ దిశలో ఇప్పటికే ప్రయత్నాలు మొదలయ్యాయన్నారు. దీనికి ఎంత కాలం పడుతుందనేది చెప్పలేమని పేర్కొన్నారు. జీఎస్టీలోని క్లిష్టత, రైతులలో అవగాహన రాహిత్యం అసలైన కారణాలు కాదని, జీఎస్టీ రూల్బుక్లోనే వ్యవసాయ ఉత్పత్తులన్నింటినీ నిల్ ట్యాక్స్ శ్లాబ్లో పెట్టడమే ప్రధానమైన కారణమని చాలా మంది నిపుణులు ఏకీభవిస్తున్నారు. ఇలా నిల్ శ్లాబ్లో ఉండటంతో తాను అమ్మే ఉత్పత్తులపై ఎలాంటి ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్నూ రైతు క్లెయిమ్ చేసుకోలేడు. ఈ సమస్యకు ఏదైనా పరిష్కారం ఉందా ..అంటే, ఇంటర్మీడియరీలుగా వాడే ఉత్పత్తులకు జీఎస్టీ ఇన్పుట్ ట్యా్క్స్ లభిస్తోంది. ఉదాహరణకు విత్తనాలు, జంతువులు–పౌల్ట్రీ ఫీడ్లు. ఇదే తరహాలో వ్యవసాయ ఉత్పత్తులకూ జీఎస్టీ ఎగ్జంప్షన్ (మినహాయింపు) వర్తింప చేయొచ్చని ఎస్ఏబీసీ డైరెక్టర్ చౌదరి సూచిస్తున్నారు.