ఆన్‌లైన్ క్లాసుల ఒత్తిడి.. ఆత్మహత్య చేసుకున్న 12 ఏళ్ల బాలిక

ఆన్‌లైన్ క్లాసుల ఒత్తిడి.. ఆత్మహత్య చేసుకున్న 12 ఏళ్ల బాలిక

అహ్మదాబాద్: లాక్‌డౌన్‌ కారణంగా ఆన్‌లైన్ క్లాసుల వల్ల ఒత్తిడికి గురైన ఓ 12 ఏళ్ల బాలిక ఆత్మ హత్యకు పాల్పడిన ఘటన గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో జరిగింది. రిపోర్ట్ ప్రకారం.. ఖుషి (12) తన పేరెంట్స్‌, తమ్ముడితో కలసి రాజ్‌కోట్‌లో ఉంటోంది. రీసెంట్‌గా ఖుషిని ఆమె పేరెంట్స్ గుజరాతీ మీడియం స్కూల్‌లో జాయిన్ చేశారు. లాక్‌డౌన్ కారణంగా స్కూల్స్‌ ఆన్‌లైన్ క్లాసులు చెబుతుండటంతో ఖుషికి ఆమె తండ్రి రోహిత్ షింగాడియా రూ.10 వేల ఖరీదైన స్మార్ట్‌ఫోన్‌ కొనిచ్చాడు. దీంతో ఖుషి ఫోన్‌లోనే క్లాసులకు హాజరవుతూ, హోం వర్క్ పూర్తి చేస్తోంది. ఎప్పటిలాగే సోమవారం కూడా హోం వర్క్ పూర్తి చేయాలని ఖుషిని తల్లి ఆదేశించింది. దీంతో ఖుషి రూమ్‌లోకి వెళ్లి తలుపులు వేసుకుంది. కొద్దిసేపటి తర్వాత తల్లి వెళ్లి చూడగా ఖుషి సీలింగ్‌కు ఉరి వేసుకొని కనిపించింది. ఆన్‌లైన్ క్లాసుల వల్ల ఒత్తిడికి గురవడం, హోం వర్క్ చేయాల్సి రావడం, మానసిక ఒత్తిడితోపాటు తన క్లాస్‌మేట్స్‌ను కలుసుకోలేకపోతున్నాననే బాధతోనే ఖుషి ఆత్మహత్య చేసుకుందని సమాచారం. కాగా, సదరు బాలిక తండ్రి రోహిత్ తమ ఇంటికి సమీపంలోనే ఆటో గ్యారేజ్ నడుపుతున్నాడని తెలిసింది. కరెంటు బిల్లులు కట్టలేని దుస్థితిలో కూడా కూతురి చదువు కోసం స్మార్ట్‌ఫోన్ కొనిచ్చాడని సమాచారం.