టోక్యె: గల్ఫ్లో రెండు ఆయిల్ ట్యాంకర్లపై దాడి జరిగిన ఘటనపై జపాన్ స్పందించింది. అటాక్ జరిగే ముందు అనుమానాస్పద స్థితిలో ఎగురుతున్న వస్తువును తమ నేవీ సిబ్బంది గుర్తించారని కొకుకా సాంగ్యో షిప్పింగ్ కంపెనీ హెడ్ యుటాకా కటాడా చెప్పారు. “ పేలుడుకు ముందు మా సిబ్బంది గాలిలో ఎగిరే వస్తువును చూశారు. దాడి వల్ల షిప్ బాడీకి హోల్ పడింది. నీటిలోకి దిగిన సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారు. ప్రాణనష్టం జరగలేదు ” అని ఆయన చెప్పారు. దాడి వల్ల పెద్ద నష్టం జరగలేదన్నారు. యూఎస్ మిలటరీ సాయంతో సిబ్బంది తిరిగి నౌకలోకి వెళ్లి బ్యాకప్ పవర్ సోర్స్ను రికవర్ చేశారని, నౌకలోని కెమికల్స్, మిథనాల్ భద్రంగా ఉన్నాయన్నారు. షిప్ మునిగిపోతుందని, టార్పిడోతో దాడి జరిగిందని వస్తున్న వార్తలను యుటాకా కటాడా ఖండించారు.