
జాక్ మా కు గుర్గావ్ కోర్టు సమన్లు
న్యూఢిల్లీ: చైనా బిలియనీర్ జాక్ మా విచారణకు హాజరు కావాలని గుర్గావ్లోని ఒక కోర్టు ఆదేశించింది. కంపెనీ యాప్లోని తప్పుడు వార్తను ఎత్తిచూపినందుకు, కొన్ని వార్తలను తొలగించినందుకు తనను జాబ్ నుంచి తొలగించారంటూ యూసీ న్యూస్ ఉద్యోగి వేసిన కేసులో ఈ నిర్ణయం తీసుకుంది. కస్టమర్ల సమాచారాన్ని రహస్యంగా ఉంచడం లేదంటూ మోడీ ప్రభుత్వం జాక్మాకు చెందిన యూసీ బ్రౌజర్, యూసీ న్యూస్ సహా 57 యాప్ లను ఇటీవల బ్యాన్ చేసిన విషయం తెలిసిందే. చైనాకు వ్యతిరేకంగా వచ్చే వార్తలను యూసీ బ్రౌజర్, యాప్ లో అనుమతించడం లేదని యూసీ వెబ్ అసోసియేట్ డైరెక్టర్ పుష్పేంద్ర సింగ్ పర్మార్ ఆరోపించారు. అందుకు గాను తనకు రూ. 2.68 లక్షల డాలర్ల పరిహారం ఇప్పించాలని కోరారు. దీంతో గుర్గావ్ జిల్లా కోర్టు సివిల్ జడ్జి సోనియా షేవ్కండ్ జాక్ మా కు నోటీసులు పంపారు. విచారణకు రావాల్సిందిగా కంపెనీ యూనిట్లలోని మరో 12 మందినీ ఆదేశించారు. వ్యక్తిగతంగా రాకుంటే లాయర్ను పంపాలని పేర్కొంటూ విచారణను ఈ నెల 29కి వాయిదా వేశారు. పర్మార్ ఆరోపణలపై రాతపూర్వకంగా వివరణ ఇవ్వాలని స్పష్టంచేశారు. దీనిపై యూసీ న్యూస్ స్పందిస్తూ తాము స్థానిక చట్టాల ప్రకారమే పనిచేస్తున్నామని, ఉద్యోగులను బాగా చూసుకుంటున్నామని వివరణ ఇచ్చింది.
For More News..