T20 World Cup 2024: న్యూయార్క్ చేరుకున్న హార్దిక్.. జట్టులో చేరని కోహ్లీ

T20 World Cup 2024: న్యూయార్క్ చేరుకున్న హార్దిక్.. జట్టులో చేరని కోహ్లీ

టీ20 వరల్డ్ కప్ కోసం టీమ్ ఇండియా వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్య మొదటి బ్యాచ్ లో భాగంగా భారత క్రికెట్ జట్టుతో పాటు న్యూయార్క్ వెళ్లని సంగతి తెలిసిందే. బీసీసీఐ పర్మిషన్ తీసుకొని పాండ్య ఆలస్యంగా అమెరికా వెళ్తానని తెలిపాడు. అయితే తాజాగా హార్దిక్ న్యూయార్క్ చేరుకున్నాడు. టీమిండియాతో చేరి జట్టులోని ఆటగాళ్లతో వార్మప్ చేశాడు. తాను ప్రాక్టీస్ చేస్తున్న ఫోటోలు ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు. 

పాండ్య జూన్ 2 నుంచి  ప్రారంభం కానున్న వరల్డ్ కప్ లో భారత జట్టు వైస్ కెప్టెన్ గా వ్యవహరించబోతున్నాడు. ఐపీఎల్ లో 2024 సీజన్ లో ముంబై కెప్టెన్ గా, ప్లేయర్ గా హార్దిక్ దారుణంగా విఫలమయ్యాడు. మరోవైపు అతని విడాకుల గురించి ఇటీవలే వార్తలొచ్చాయి. ఈ నేపథ్యంలో పాండ్య తీవ్ర ఒత్తిడిలో వరల్డ్ కప్ బరిలోకి దిగుతున్నట్లు కనిపిస్తుంది. భారత్ వేదికగా జరిగిన వన్డే వరల్డ్ కప్ లో గాయపడిన పాండ్యకు 7 నెలల తర్వాత ఇదే తొలి అంతర్జాతీయ మ్యాచ్. జూన్ 1న బంగ్లాదేశ్‌తో భారత్‌ ఆడే ఏకైక వార్మప్‌ మ్యాచ్‌లో హార్దిక్ బరిలోకి దిగనున్నాడు. 

విరాట్ కోహ్లీ మినహాయిస్తే అందరూ ప్లేయర్లు న్యూయార్క్ చేరుకున్నారు. కోహ్లీ బీసీసీఐ నుంచి ఆలస్యంగా అమెరికా వెళ్తానని అనుమతి పొందిన సంగతి తెలిసిందే.  ప్రస్తుతం కోహ్లీ ముంబైలోనే ఉన్నట్టు సమాచారం. మే 30వ తేదీ విరాట్ న్యూయార్క్‌కు వెళ్లనున్నట్టు వార్తలు వస్తున్నాయి. అదే జరిగితే జూన్ 1న బంగ్లాదేశ్‌తో భారత్‌ ఆడే ఏకైక వార్మప్‌ మ్యాచ్‌లో కోహ్లీ దూరం అయ్యే అవకాశం ఉంది. 

ALSO READ | చిట్టి కప్పులో చిరు జట్లు.. మరో నాలుగు రోజుల్లో టీ20 వరల్డ్ కప్

టీ20 ప్రపంచ కప్ పోరుకు అమెరికా, వెస్టిండీస్ దేశాలు సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్నాయి. ఈ టోర్నీ జూన్ 2న ప్రారంభమై జూన్ 29న ముగియనుంది. ఈ మెగా టోర్నీలో భారత క్రికెట్ జట్టు జూన్ 5న ఐర్లాండ్‌తో తొలి మ్యాచ్ ఆడనుండగా.. జూన్ 9న దాయాది దేశం పాకిస్థాన్‌‌తో తలపడనుంది. ప్రాక్టీస్‌లో భాగంగా మే 31న భారత్ -బంగ్లాదేశ్ జట్ల మధ్య ఏకైక వార్మప్ మ్యాచ్ జరగనుంది.