
తాను తీసుకున్న కొన్ని చెత్త నిర్ణయాలతోనే ఢిల్లీ చేతిలో ఓటమిపాలయ్యామని గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా వెల్లడించాడు. రాజస్థాన్ రాయల్స్ పై గెలిచిన తర్వాత మాట్లాడిన పాండ్యా...ఢిల్లీతో జరిగిన మ్యాచులో కీలక సమయంలో పొరపాట్లు చేసి స్వల్ప లక్ష్యాన్ని ఛేదించలేక చతికిలపడ్డామన్నాడు. మ్యాచుల్లో చేసిన తప్పులను అంగీకరించడానికి తాను సిగ్గుపడననన్నాడు. తప్పులను అంగీకరించి వాటిని సరిచేసుకోవడమే తన విజయరహస్యమని హార్దిక్ పాండ్యా చెప్పుకొచ్చాడు.
పొరపాట్లు చేశా...
ఢిల్లీతో జరిగిన మ్యాచ్లో నేను కొన్ని చెత్త నిర్ణయాలు తీసుకున్నా... కొన్ని పొరపాట్లు కూడా చేశా..కానీ రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచులో పొరపాట్లు చేయకుండా మ్యాచులో విజయం సాధించాం. ముఖ్యంగా శుభ్ మన్ గిల్ సగం పని పూర్తి చేశాడు. అతను అవుటయ్యే సమయానికి నా పని సగం పూర్తయింది. ఢిల్లీ చేతిలో ఓడిపోయిన తర్వాత ఏం చేయాలని ఆలోచించుకోవడానికి నాకు చాలా టైం దొరికింది. అందుకే రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచులో పొరపార్లను సరిదిద్దుకుని ఆడాం. విజయం సాధించాం... అని పాండ్యా చెప్పుకొచ్చాడు.
రషీదే చూసుకుంటాడు..
గుజరాత్ టైటాన్స్ టీమ్లో స్పిన్నర్లను హ్యాండిల్ చేసే బాధ్యతను రషీద్ ఖాన్కే వదిలేస్తానని హార్దిక్ పాండ్యా చెప్పాడు. ముఖ్యంగా స్పిన్నర్ నూర్ ను చూసుకునే బాధ్యతను రషీద్ ఖాన్ చూసుకుంటాడని తెలిపాడు. రషీద్, నూర్ అఫ్ఘాన్ కు చెందిన వారే కాబట్టి..నూర్ తో మాట్లాడేందుకు రషీద్ కన్నా బెటర్ ఆప్షన్ మరొకరు లేరన్నాడు. ఈ ఇద్దరూ బౌలింగ్ చేసే సమయంలో ఫీల్డింగ్ చాలా స్టాండర్డ్గా ఉంటుందని... ఇద్దరూ ఆత్మవిశ్వాసతో బౌలింగ్ చేస్తారని చెప్పాడు. కీపర్గా వృద్ధిమాన్ సాహా ది బెస్ట్ అన్నాడు.
సూపర్ విక్టరీ..
రాజస్థాన్ రాయల్స్ పై గుజరాత్ టైటాన్స్ 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ 17.5 ఓవర్లలో 118 పరుగులకే ఆలౌట్ అయింది. సంజూ శాంసన్ 30 పరుగులు చేశాడు. ఆ తర్వాత 119 పరుగుల టార్గెట్ ను గుజరాత్ టైటాన్స్ 13.5 ఓవర్లలో ఒకే వికెట్ కోల్పోయి ఛేదించింది.వృద్ధిమాన్ సాహా 41 పరుగులు చేయగా..శుభమన్ గిల్ 36 పరుగులు, హార్దిక్ పాండ్యా 39 పరుగులు సాధించారు.