గిరిజనుల గోడు ఎవరికీ పట్టదా?

 గిరిజనుల గోడు ఎవరికీ పట్టదా?

రిజర్వేషన్లు అభివృద్ధికి గొడ్డలి పెట్టు అన్న వాదనలు ఎప్పటి నుంచో ఉన్నాయి. ఇందుకు అనుగుణంగా అట్టడుగు వర్గాలకు రాజ్యాంగం ఇచ్చిన హక్కులకు పాలక వర్గాలు తూట్లు పొడుస్తూ వస్తున్నాయి. ముఖ్యంగా గిరిజనులకు కల్పించిన భూ హక్కు చట్టం నుంచి రిజర్వేషన్ల వరకూ దేని అమలు పైనా ప్రభుత్వాల్లో చిత్తశుద్ధి లేదు. ఎస్టీ రిజర్వేషన్లలో ఇతరులనూ చొప్పించాలని పాలకులు చూస్తుంటే.. కోర్టుల తీర్పులు వాటికి బలాన్నివ్వడం మరింత బాధాకరం. ఉమ్మడి ఏపీలో ఏజెన్సీల్లోని స్కూల్ టీచర్ల నియామకాల్లో గిరిజనులకే  100% రిజర్వేషన్లు కల్పించేందుకు ఇచ్చిన జీవోను ఏజెన్సీల్లోని ఇతర వర్గాలకు అన్యాయం జరుగుతుందనే పేరుతో సుప్రీం కోర్టు రద్దు చేసి ఏడాది కావస్తున్నా, దాని పునరుద్ధరణకు రాష్ట్ర సర్కారు సీరియస్గా ప్రయత్నించకపోవడం దారుణం.

మన దేశంలో అట్టడుగు వర్గాలను పైకి తీసుకురావడం కోసం తీసుకొచ్చిన రిజర్వేషన్లకు పాలకులు తూట్లు పొడుస్తున్నారు. రాజ్యాంగం కల్పించిన హక్కులను సైతం ఏవో లొసుగులను అడ్డం పెట్టుకుని ఉల్లంఘిస్తున్నారు. ఏ పార్టీ పాలనా పగ్గాలు చేపట్టినా సరే వాటిలో అగ్రవర్ణాలు, ఆధిపత్య వర్గాలే పెత్తనం చేయడం వల్ల వారికి ఈ రిజర్వేషన్లపై సానుకూల దృక్పథం కొరవడింది. రాజ్యాంగం కల్పించిన ప్రత్యేక హక్కులపై సదభిప్రాయం లేకపోవడంతో రాజకీయ అవసరాల కోసం పైపై ప్రచారాలు చేసుకోవడం తప్ప నిజంగా మేలు చేసే ఆలోచన కనిపించడం లేదు.
ఒక వైపే ప్రచారం
మన దేశంలో అధికారంతోపాటు ప్రసార సాధనాలను గుప్పిట పెట్టుకున్న ఉన్నత సామాజిక వర్గాలు పీడిత, బాధిత వర్గాలకు రాజ్యాంగపరంగా కల్పించిన వెసులుబాట్లను ప్రచారం చేసినంతగా వాటి అమల్లో లొసుగులపై చర్చ పెట్టవు. ఎస్సీ , ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ దుర్వినియోగం గురించి జరిగే ప్రచారం ఆ చట్టాన్ని వినియోగించుకోలేక ఇబ్బంది పడుతున్నవారి గురించి చెప్పే విషయంలో జరగదు. ఈ చట్టానికి అపప్రద తెచ్చిపెట్టడమే వారి ఉద్దేశం కనుక అణచివేతకు గురవుతున్న బాధితులను వదిలేసి, చట్టం దుర్వినియోగం గురించి పెద్దగా చర్చలు పెడుతారు. కానీ ఏ శక్తుల కారణంగా ఇది జరుగుతుందో విశ్లేషించేందుకు మాత్రం మనసు రాదు.
ఏజెన్సీల్లో యువతకు చేదోడైన జీవో అది
బయటి ప్రపంచం పోకడలకు చాలా దూరంగా ఉన్న ఏజెన్సీ ప్రాంతాల్లో జనం జీవన శైలి పూర్తి భిన్నంగా ఉంటుంది. వాళ్లకు చదువులు, ఇతర మౌలిక సదుపాయాలు నేటికీ అంతంత మాత్రంగానే అందుతున్నాయి. పైగా ఏజెన్సీ ప్రాంతాల్లో హాస్పిటల్స్, స్కూళ్లలో పని చేయాలన్నా కూడా ఇప్పటికీ మైదాన ప్రాంత వాసులు అంతగా సుముఖత చూపడం లేదన్నది అందరికీ తెలిసిన వాస్తవం. దీంతో 1986లో జీవో నంబర్ 275 ద్వారా ఉమ్మడి ఏపీలో నాటి సర్కారు ఏజెన్సీల్లో టీచర్ ఉద్యోగాలకు గిరిజనులకే 100% రిజర్వేషన్లు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 1989లో ట్రైబ్యునల్ మధ్యంతర ఉత్తర్వులు, 1998లో సుప్రీం కోర్టు తీర్పుతో ఆ రిజర్వేషన్లు నిలిచిపోయాయి. అయితే 2000 సంవత్సరంలో నాటి ప్రభుత్వం మళ్లీ జీవో నంబర్ 3 ద్వారా మళ్లీ 100 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. దీనిపై మళ్లీ కొంత మంది కోర్టుకు వెళ్లారు. ఏజెన్సీ ప్రాంతాల్లో నివసించే గిరిజనేతరులకు అన్యాయం జరుగుతోందంటూ వాదనలు వినిపించారు. అయితే గిరిజన యువతలో చదువుకున్న వాళ్లు తమ ప్రాంతాల్లోని స్కూళ్లలో టీచర్లుగా ఉద్యోగాలు పొంది తమ తర్వాత జనరేషన్ పిల్లలకు చదువులు చెబుతూ వస్తున్నారు. వారికి ఉపాధి కల్పించడంతో పాటు తమ ప్రాంతానికి మేలు చేయడంలో ఈ జీవో చేదోడుగా ఉండేది. గత ఏడాది ఏప్రిల్లో సుప్రీం కోర్టు ఈ జీవోను రద్దు చేస్తూ తీర్పు ఇచ్చింది. ఈ జీవో అత్యంత వివాదాస్పద ఉత్తర్వుగా జడ్జిలు పేర్కొన్నారు. జీవో నంబర్3 రాజ్యాంగ విరుద్ధమని తీర్పు ఇచ్చారు. అది చెల్లదంటూ తాము ఇచ్చిన ఉత్తర్వును ఉల్లంఘిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఏవైనా నియామకాలు , పదోన్నతులు చేపట్టినట్టయితే 1986 నుంచి జరిగిన నియామకాలన్నీ తిరగదోడతామని హెచ్చరించడం బాధాకరం. వాస్తవానికి ఆ జీవో రాజ్యాంగంలోని షెడ్యూల్ 5 ప్రకారం ఇచ్చారని, ఇది పూర్తిగా చట్టబద్ధమేనని, దీనిపై జుడిషియల్ రివ్యూ చేసే హక్కు కూడా ఉండదని వాదించి గిరిజన హక్కులను కాపాడడంలో మన రాష్ట్ర ప్రభుత్వం ఫెయిల్ అయింది.
ఏజెన్సీల్లో ఇతరుల జనాభా ఎట్ల పెరిగింది?
జీవో నంబర్ 3ని మొదటి నుంచి వ్యతిరేకిస్తోంది ఏజెన్సీల్లోని గిరిజనేతర వర్గాలే. ఈ జీవో వల్ల ఇతర వర్గాలకు అన్యాయం జరుగుతోందని వాదిస్తున్నారు. అసలు పరిశీలించాల్సిన విషయం ఏజెన్సీల్లో ఇతర వర్గాల జనాభా ఎలా పెరిగిందన్నది. వాస్తవానికి 1950 నుంచి 80 దశకం వరకు ఆదిలాబాద్ జిల్లాలో గిరిజనుల జనాభా 90 శాతం ఉంటే 90ల్లోకి వచ్చేసరికి వారు మైనారిటీలుగా మారిపోయారు. మైదాన ప్రాంతాల నుంచి వలస వచ్చిన భూస్వామ్య, వ్యాపార, గిరిజనేతర వర్గాలు అక్కడి భూమి, ఆర్ధిక వ్యవస్థను తమ గుప్పిట పెట్టుకున్నాయి. జనాభా పరంగానూ మెజారిటీలుగా మారిపోయారు. ఒక్క ఆదిలాబాద్ అనే కాకుండా ఏజెన్సీ విస్తరించిన అన్ని జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి. నిజానికి గిరిజన ప్రాంతాల్లో ఇతరులు భూములు కొనడానికి లేదు. ఆ భూపరిరక్షణ హక్కు చట్టాలకు సైతం ఈ వర్గాలు తూట్లు పొడిచాయి. రాజ్యాంగపరమైన రక్షణ ఉన్నా సరే గిరిజన చట్టాలను ఆధిపత్య వర్గాలు నీరు గార్చేశాయి. పెసాచట్టం నిబంధనలకు నీళ్లు వదిలి పెట్రోలు పంపులు, కర్మాగారాలు, సినిమా హాళ్లు, పిండి మిల్లులు ధాన్యం మిల్లులు, ఐస్ ఫ్యాక్టరీలు, మద్యం దుకాణాలు.. ఇలా ఒకటేంటి ఏజెన్సీలో అన్నీ బినామీల పేరుతో నడిపిస్తున్నారు. పేరు గిరిజనులది.. పెత్తనం అగ్రవర్ణాల పెద్దలది. గిరిజనుల వనరులను అడ్డం పెట్టుకుని అడ్డంగా సంపాదించేస్తున్నారు. పైగా చట్టానికి తూట్లు పెట్టేందుకు పెద్దగా శ్రమించాల్సిన అవసరం లేదు కాబట్టి చాపకింద నీరులా పనుల్ని చక్కబెడుతున్నారు. కానీ జీవో 3 ద్వారా గిరిజనులకు దక్కే గుప్పెడు ఉద్యోగాలపై గిరిజనేతరులంతా ఏకమై పోరాటం చేయడం ఘోరం.
అడుగడుగునా ఉల్లంఘనలే
నిజానికి బ్రిటిష్ కాలం నుంచి ఊపిరి పోసుకున్న ఏజెన్సీ చట్టాలన్నీ గిరిజన తెగలను గిరిజనేతరులు, మైదాన ప్రాంత దోపిడీ నుంచి రక్షించేందుకు ఉద్దేశించినవే. స్వాతంత్ర్య అనంతరం రూపొందిన 1/70 చట్టం ఇందులో కీలకమైంది. రాజ్యాంగ పరిధిలో 1/70 చట్టాన్ని నిర్వచించినా జీవో నంబరు 3 దాన్ని బలోపేతం చేసేందుకు తోడ్పడేదే తప్ప ఎంతమాత్రమూ ఆ చట్రానికి బాహ్యంగా లేదు. కానీ 1/70 లో భాగమైన అన్ని చట్టాలు ఏండ్లకు తరబడి అడుగడుగునా ఉల్లంఘనకు గురవుతూ వచ్చాయి.
రివ్యూ పిటిషన్ వేసి వదిలేస్తరా?
ఏజెన్సీలో ఎస్టీల రిజర్వేషన్లను వ్యతిరేకించే అగ్రవర్ణ, బీసీ వర్గాలు మైదాన ప్రాంతం వచ్చేసరికి రెండుగా విడిపోతాయి. గిరిజనుల జీవన విధానమేంటి? వారి వెనుకబాటు ఏంటి? వారికున్న ఆర్థిక వనరులేంటి? ఆహార భద్రత ఎంత? మౌలిక వసతులు ఏ మేరకు ఉన్నాయి? వంటి ప్రశ్నలకు సమాధానాలను పరిగణనలోకి తీసుకుంటే జీవో 3 వారి త్యాగాలకు పెద్ద తులాభారమేం కాదు. గిరిజన సంస్కృతి, సంప్రదాయాలను రక్షించాలన్న ఆశయంతో తెచ్చిన రాజ్యాంగ నిబంధనలు, చట్టాలు కూడా ఏనాడూ వారికి భద్రత కల్పించింది లేదు. ప్రస్తుత పరిస్థితుల్లో యువతకు అంతో ఇంతో ఉపాధి కల్పిస్తున్న జీవో నంబర్ 3 విషయంలోనూ తెలంగాణ సర్కారు గిరిజనుల కోసం చేసిందేమీ లేదు. ఏడాది క్రితం జీవో రద్దు చేస్తూ సుప్రీం తీర్పు వచ్చింది. అయితే దాని పునరుద్ధరణ కోసం కోర్టులో ఒక రివ్యూ పిటిషన్ వేసి గిరిజన సంక్షేమం కోసం కట్టుబడి ఉన్నామని కంటితుడుపుగా ప్రకటన చేయడం మినహా చేసిందేమీ లేదు. దాదాపు ఈ ఏడాది సమయంలో సీరియస్గా ప్రయత్నాలు చేసిన దాఖలాలు లేవు.-మన్నారం నాగరాజు, తెలంగాణ లోక్‌సత్తా పార్టీ, రాష్ట్ర అధ్యక్షుడు.